AP Crime : బెజవాడలో కిరాతకం... కేవలం సెల్ ఫోన్ కోసం స్నేహితుడి హత్య
మద్యంమత్తులో స్నేహితున్ని అత్యంత దారుణంగా చంపిన దుర్మార్గున్ని బెజవాడ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
![Man brutal murder in Vijayawada NTR District AKP Man brutal murder in Vijayawada NTR District AKP](https://static-ai.asianetnews.com/images/01h8p78vtc5r4d3qp8m7nevqm1/asianet-news-tamil--31-_363x203xt.jpg)
విజయవాడ : తాగినమత్తులో స్నేహితుల మధ్య సెల్ ఫోన్ కోసం జరిగిన గొడవ చివరికి ఒకరి హత్యకు దారితీసింది. కృష్ణా నది వద్దకు తీసుకెళ్లి స్నేహితున్ని కత్తులతో పొడిచి అత్యంత దారుణంగా అంతమొందించారు కొందరు దుండగులు. ఈ అమానుష ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... బెజవాడకు చెందిన స్వామి, శివ, కనక మంచి స్నేహితులు. బుధవారం ఉదయమే ఈ ముగ్గురూ కలిసి మందు కొట్టారు. తాగిన మత్తులో వున్న స్వామి ఆర్థిక అవసరాల కోసం తన సెల్ ఫోన్ అమ్మిపెట్టాలని కనకను కోరాడు. అయితే ఇందుకు రెండు రోజుల సమయం కావాలని కనక చెప్పగా వెంటనే అమ్మిపెట్టాలని స్వామి పట్టుబట్టాడు. దీంతో తాగినమైకంలో వున్న వీరిమధ్య వాగ్వాదం జరిగి అదికాస్తా గొడవకు దారితీసింది. అయితే ఈ వివాదంలో తలదూర్చిన శివ గొడవకు కారణమైన మొబైల్ తీసుకుని నేలకేసి కొట్టాడు. దీంతో అదికాస్తా పగిలిపోయి అమ్మేందుకు పనికిరాకుండా పోయింది.
Read More breaking news : కూతురిని వేధిస్తున్నారని అల్లుడు, తల్లిదండ్రుల దారుణ హత్య..
తన సెల్ ఫోన్ పగలగొట్టిన శివపై స్వామి కోపంతో రగిలిపోయాడు. ఇంటికి వెళ్లి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మళ్లీ మందుతాగాడు స్వామి. ఇలా ఫుల్లుగా మందుకొట్టిన ఈ ముగ్గురు శివను చంపాలని నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా మందు తాగుదామని చెప్పి సాయంత్రం శివను పిలుచుకుని కృష్ణా నది వద్దకు తీసుకెళ్లాడు స్వామి. అప్పటికే అక్కడున్న మరో ఇద్దరితో కలిసి శివను కత్తితో పొడిచి దారుణంగా చంపాడు స్వామి.
శివ మృతదేహం రక్తపుమడుగులో పడివుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శివను చంపింది స్వామి అని గుర్తించారు. అతడి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.