అద్భుతం: కుల్దీప్ యాదవ్ ను ఆకాశానికెత్తిన విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కూడా అత్యద్భుతమని విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. ఆదివారం పాక్తో జరిగిన మ్యాచును భారత్ 89 పరుగుల తేడా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ విజయం తర్వాత కోహ్లీ మాట్లాడాడు.
మాంచెస్టర్ : పాకిస్తాన్ బ్యాట్స్మన్ బాబర్ ఆజంను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసిన బంతి అత్యద్భుతమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసించాడు. బాబర్, ఫకార్ మ్యాచ్ తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారని, కానీ కుల్దీప్ ఈ జోడిని అద్భుతంగా విడగొట్టాడని అన్నాడు.
రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కూడా అత్యద్భుతమని విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. ఆదివారం పాక్తో జరిగిన మ్యాచును భారత్ 89 పరుగుల తేడా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ విజయం తర్వాత కోహ్లీ మాట్లాడాడు. తమ ఇన్నింగ్స్ సగం పూర్తయిన తర్వాత బంతి స్పిన్ తిరగడం మొదలైందని, టాస్ గెలిస్తే బౌలింగే తీసుకునేవాళ్లమని అన్నాడు.
రోహిత్ మరోసారి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని, రాహుల్ ఉత్తమ వన్డే ఆటగాడిని అని చాటుకున్నాడని ఆయన అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తమను ఓడించారని, ఈ మ్యాచ్ను అతి భావోద్వేగంతో తీసుకుంటే చేదు ఫలితం రావచ్చునని, అందుకని ఆ ఓటమి గురించి ఆలోచించలేదని అన్నాడు.
ఆటలో ఇలాంటివి భాగమని భావించి ముందుకెళ్లామని, దానికి తగ్గ ఫలితమే వచ్చిందని, తొడకండరాలు పట్టేయడంతో భువనేశ్వర్ రెండు, లేదా మూడు మ్యాచ్లకు దూరం కానున్నాడని చెప్పాడు. కానీ కీలక సమయంలో అందుబాటులోకి వస్తాడని కోహ్లి అన్నాడు.