ధావన్ లో కసి ఉంది, అందుకే అలా చేశాం: కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
టోర్నీలోని కీలక సమయాల్లో ధావన్ ను ఓపెనింగ్ సేవలను వినియోగించుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తోందని కోహ్లీ తెలిపాడు. బుధవారం న్యూజిలాండ్తో మ్యాచ్ రద్దైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు.
లండన్: గాయపడిన ఓపెనర్ శిఖర్ ధావన్ పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. శిఖర్ ధావన్ స్థానంలో అధికారికంగా ప్రత్యామ్నయ ఆటగాడిని తీసుకోకపోవడానికి గల కారణాన్ని అతను వెల్లడించాడదు. వేచి చూసే ధోరణిలో భాగంగానే శిఖర్ను జట్టుతో కొనసాగిస్తున్నామని చెప్పాడు.
టోర్నీలోని కీలక సమయాల్లో ధావన్ ను ఓపెనింగ్ సేవలను వినియోగించుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తోందని కోహ్లీ తెలిపాడు. బుధవారం న్యూజిలాండ్తో మ్యాచ్ రద్దైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు. లీగ్ మ్యాచ్ల చివరి దశలో లేదా సెమీస్కు ధావన్ తప్పకుండా అందుబాటులోకి వస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకే మేం అతని జట్టుతో ఉంచుకున్నామని చెప్పాడు.
ధావన్ కు ఆడాలనే కసి ఎక్కువ అని, అదే అతన్ని గాయం నుంచి కోలుకునేలా చేస్తుందని అన్నాడు. ధావన్ చేతికి కొన్ని వారాల పాటు ప్లాస్టర్ తప్పనిసరి అని, గాయం నుంచి కోలుకున్న తర్వాత అతని సేవలు మేం ఉపయోగించుకుంటామని కోహ్లి చెప్పాడు.
ధావన్ గాయపడడంతో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇంగ్లాండ్ పయనమైనప్పటికీ అతను జట్టులో చేరలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు గాయపడిన తర్వాత అతను పూర్తిగా జట్టు నుంచి బయటకు వెళ్లిపోతేనే అతని స్థానంలో మరో ఆటగాడిని టెక్నికల్ కమిటీ అనుమతిస్తుంది.
ప్రస్తుతం పంత్ జట్టుతో ఉండకుండా మాంచెస్టర్లో ఉంటాడని, ప్రస్తుతానికి పంత్ స్టాండ్ బై మాత్రమేనని, ధావన్ స్థానంలో ఎంపిక చేయలేదని బీసీసీఐ ప్రకటించింది.
ధావన్ గాయంపై ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ స్పందించాడు. ధావన్కు అయిన గాయంతో అతని బ్యాటింగ్కు ఇబ్బంది లేదని, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పటికి సహజసిద్దంగా అతను కుడిచేతి వాటం బ్యాట్స్మన్. కాకపోతే ఈ గాయం అతని ఫీల్డింగ్పై, క్యాచ్లు పట్టుకోవడంపై ప్రభావం చూపుతుందని అన్నాడు.