ఇండియా-వెస్టిండిస్ సెకండ్ టెస్ట్: ధోని రికార్డును బద్దలుగొట్టిన రిషబ్ పంత్
టీమిండియా సీనియర్ ప్లేయర్ ఎంఎస్ ధోని పేరిట వున్న అరుదైన రికార్డును యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ బద్దలుగొట్టాడు.వెస్టిండిస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ ద్వారా పంత్ ఈ ఘనత సాధించాడు.
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ నిజంగానే తాను ధోని వారసుడినని నిరూపించుకున్నాడు. ధోని స్థానంలో వికెట్ కీపర్ గా అవకాశాన్ని పొందిన పంత్ తాజాగా ఆయన రికార్డులనే బద్దలుగొడుతున్నాడు. తాజాగా వికెట్ కీపర్ గా ధోని సాధించిన ఓ అరుదైన రికార్డును పంత్ అత్యంత సులభంగా అధిగమించాడు.
టీమిండియా-వెస్టిండిస్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ ద్వారా పంత్ ఓ అరుదైన ఘనత సాధించాడు. అతి తక్కువ టెస్టుల్లోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత వికెట్ కీపర్ గా పంత్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు ధోని పేరిట వుండగా దాన్ని పంత్ బద్దలుగొట్టాడు. పంత్ కేవలం 11 టెస్టుల్లోనే 50 వికెట్లు పడగొట్టడంలో భాగస్వామ్యం వహించగా ధోని 15 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించాడు.
వెస్టిండిస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ ద్వారా పంత్ ఈ ఘనత సాధించాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో బ్రాత్ వైట్ ను ఔట్ చేయడం ద్వారా పంత్ ఖాతాలోకి 50వ వికెట్ చేరింది. ఇంకా ఈ మ్యాచ్ లో విండీస్ సెకండ్ ఇన్నింగ్స్ ఆడాల్సివుంది. కాబట్టి మరికొన్ని వికెట్లు పంత్ ఖాతాలోకి చేరే అవకాశముంది.
ఇలా వికెట్ కీపర్ గా రాణిస్తూ 2020 టీ20 వరల్డ్ కప్ నాటికి జట్టులో స్థిరపడిపోవాలని పంత్ భావిస్తున్నాడు. టీమిండియా మేనేజ్మెంట్, సెలెక్టర్లు కూడా ఇదే ఆలోచనతో అతడికి ఎక్కువగా అవకాశాలిస్తున్నారు. ఇలా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పంత్ అదరగొడుతున్నాడు.
ఇదే వెస్టిండిస్ పర్యటనలో ధోని పేరిట వున్న టీ20 రికార్డును కూడా పంత్ బద్దలుగొట్టిన విషయం తెలిసిందే. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ గా ధోని పేరిట వున్న రికార్డును పంత్ బద్దలుగొట్టాడు. ఇలా టీ20, వన్డే సీరిసుల్లో బ్యాట్ మెన్, వికెట్ కీపర్ గా పంత్ పరవాలేదనిపించాడు. కానీ టెస్టుల్లో మాత్రం వికెట్ కీపింగ్ లో రాణిస్తూ ధోని రికార్డును బద్దలుగొట్టాడు.
సంబంధిత వార్తలు
ధోనీ ఒకే రికార్డు... రెండుసార్లు బద్దలుగొట్టిన పంత్