ఒడిశా రైలు ప్రమాద బాధితులకు నివాళి అర్పించిన ఇండియా, ఆసీస్..
WTC Final 2023:వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో భాగంగా ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్లో భారత, ఆసీస్ ఆటగాళ్లు ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతి చెందినవారికి నివాళి అర్పించారు.
నాలుగు రోజుల క్రితం ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారికి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఘనంగా నివాళి అర్పించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో భాగంగా ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్లో భారత, ఆసీస్ ఆటగాళ్లు రైలు ప్రమాద ఘటనలో మృతి చెందినవారికి నివా ళి అర్పించారు. ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ఉననవాళ్లు కూడా నిమిషం పాటు మౌనం పాటించాలని మైక్ లో అనౌన్స్ చేయగానే ఓవల్ స్టేడియంలో ఉన్నవారంతా రైలు ప్రమాద మృతులకు నివాళి అర్పించారు.
అంతేగాక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారికి సంఘీభావం తెలిపేందుకు గాను టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా బ్లాక్ ఆర్మ్ బ్యాండ్ ను ధరించారు.
బీసీసీఐ కూడా తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన బాధితులకు ఇండియన్ క్రికెట్ టీమ్ ఒక నిమిషం పాటు మౌనం పాటించింది. మరణించిన వారికి సంతాపం తెలియజేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, స్నేహితులు, కుటుంబసభ్యులకు మద్దతుగా సానుభూతిని తెలిపింది. ఆ మేరకు టీమిండియా నేటి మ్యాచ్ లో నల్లబ్యాండ్ లు ధరించనుంది..’అని ట్వీట్ చేసింది.
కాగా నాలుగు రోజుల క్రితం ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది అసువులుబాశారు. సుమారు వెయ్యికి పైగా గాయాలపాలై ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ మొదలు బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో పాటు ఇషాన్ కిషన్ లను బెంచ్ కే పరిమితం చేసింది. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ ఫార్ములాతో టీమిండియా బరిలోకి దిగింది. 16 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా.. ఒక వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. నాలుగో ఓవర్లోనే ఆసీస్ కు షాకిచ్చాడు. ఆ ఓవర్లో సిరాజ్ వేసిన నాలుగో బంతికి ఖవాజా.. వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ కు తుది జట్లు :
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా జట్టు : డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బొలాండ్