భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ను ఓ జర్నలిస్ట్ బెదిరింపులకు గురి చేశారని వచ్చిన ఆరోపణలను విచారించేందుకు బీసీసీఐ ఓ కమిటీ వేసింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని వృద్ధిమాన్ సాహా చెప్పారు. 

టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) పై ఓ జర్నలిస్టు (journalist) బెదిరింపులకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోప‌ణ‌ల‌ను విచారించాలని బీసీసీఐ (bcci) నిర్ణయించింది. ఈ మేరకు ముగ్గురు స‌భ్యుల‌తో ఓ క‌మిటీని నియ‌మించింది. వచ్చే వారం ఈ కమిటీ దర్యాప్తు ప్రారంభించనుంది. 

కొంత కాలం నుంచి వృద్ధిమాన్ సాహా పేరు వార్త‌ల్లో నిలుస్తోంది. ఇటీవ‌ల భార‌త క్రికెట్ టీం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (rahul dravid) తన‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ (international cricket) కు వీడ్కోలు చెప్పాల‌ని సూచించార‌ని ట్వీట్ (tweet) చేశారు. ఆ ట్వీట్ పెద్ద సంచ‌ల‌నంగా మారింది. అనంత‌రం ఓ జ‌ర్న‌లిస్ట్ (journalist) త‌న‌ను ఇంట‌ర్వ్యూ ఇవ్వాలంటూ బెదిరిస్తున్నార‌ని మ‌రో ట్వీట్ చేశారు. ఇంట‌ర్వ్యూ కోసం ఆ జ‌ర్న‌లిస్ట్ వృద్ధిమాన్ సాహాతో జరిపిన వాట్సాప్ conversation ను షేర్ చేశారు. అయితే ఆ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఎవ‌రు అనేది మాత్రం అత‌డు వెల్ల‌డించ‌లేదు. 

ఆ జర్నలిస్ట్ పేరు బ‌హిర్గ‌తం చేసి ఆ వ్య‌క్తి కెరీర్ (career)ను నాశనం చేసే ఉద్దేశం త‌నకు లేద‌ని వృద్ధిమాన్ సాహా చెప్పారు. త‌న స్వభావం కూడా అలాంటిది కాద‌ని అన్నారు. అత‌డు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని సూచించారు. అయితే జర్నలిస్ట్ పేరు ఏమిటో చెప్పాలంటూ బీసీసీఐ (bcci) వృద్ధిమాన్ సాహాను కోరింది. అయితే దానికి ఆయ‌న మొద‌ట నిరాక‌రించినా.. ఇప్పుడు ఆయ‌న గుర్తింపును వెల్ల‌డిస్తాన‌ని తెలిపారు. బీసీసీఐ విచార‌ణకు త‌ను పూర్తిగా స‌హ‌క‌రిస్తాన‌ని అన్నారు. 

బీసీసీఐ నేడు నియ‌మంచిన క‌మిటీలో ముగ్గురు స‌భ్యులు ఉంటారు. ఈ మేర‌కు బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ‘‘ త్రిసభ్య కమిటీలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా (Rajiv Shukla), కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్ (Arun Singh Dhumal), అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ప్రభతేజ్ సింగ్ భాటియా (Prabhtej Singh Bhatia) ఉన్నారు. కమిటీ వచ్చే వారం మొదట్లో తన పని మొదలు పెడుతుంది. క్రికెటర్‌ను ఇంటర్వ్యూ ఇవ్వాలని ఓ జర్నలిస్ట్ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి’’ అని బీసీసీఐ ఆ ప్రకటనలో తెలిపింది.