WPL 2023:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో వరుసగా మూడు మ్యాచ్ లు ఓడినా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆట మారలేదు.  ప్రత్యర్థులు మారుతున్నా ఆ జట్టు తలరాత  మారడం లేదు. 

వరుసగా హ్యాట్రిక్ ఓటములు.. ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.. ఆడుతున్నది కీలక మ్యాచ్.. అయినా ఆర్సీబీ కథ మారలేదు. బ్యాటింగ్ లో వైఫల్యాలను కొనసాగిస్తూ ఆ జట్టు యూపీ వారియర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మరోసారి నిరాశపరిచింది. ఆ జట్టులో ఎలీస్ పెర్రీ (39 బంతుల్లో 52, 6 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ డివైన్ (24 బంతుల్లో 36, 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు.. 138 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటర్లు విఫలమైన ఈ మ్యాచ్ లో ఆర్సీబీకి బౌలర్లైనా అదృష్టం తీసుకొస్తారో వేచి చూడాలి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి మరోసారి ఆశించిన ఆరంభం దక్కలేదు. కెప్టెన్ స్మృతి మంధాన (4) మరోసారి నిరాశపరిచింది. కానీ మరో ఓపెనర్ సోఫీ డివైన్ దూకుడుగా ఆడింది. తొలి వికెట్ కు మంధానతో డివైన్ 29 పరుగులు జోడించగా అందులో 25 ఆమెవే. ఇక వన్ డౌన్ లో వచ్చిన ఎలీస్ పెర్రీ కూడా రెచ్చిపోయి ఆడింది. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 44 పరుగులు జోడించారు. కానీ ఆర్సీబీ ఆ తర్వాత క్రమంగా వికోట్లు కోల్పోయింది. 

ఎక్లెస్టోన్ వేసిన ఆర్సీబీ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో రెండో బంతికి డివైన్ క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత కొంతసేపటికే కనిక అహుజా (8) ను దీప్తి శర్మ ఔట్ చేసింది. 12వ ఓవర్ వేసిన రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్ లో హెదర్ నైట్ (2) రనౌట్ అయింది. 13వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీసిన పెర్రీ ఈ సీజన్ లో తొలి అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. అదే ఓవర్లో శ్రేయాంక పాటిల్ (15) రెండు ఫోర్లు కొట్టింది. కానీ ఎక్లిస్టోన్ వేసిన 15వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద అంజలి సర్వణికి క్యాచ్ ఇచ్చింది. 15 ఓవర్లలో ఆ జట్టు 117 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. 

Scroll to load tweet…

చివరి ఓవర్లలో ఆర్సీబీ పతనం మరింత వేగంగా సాగింది. దీప్తి శర్మ వేసిన 17వ ఓవర్లో పెర్రీని దీప్తి శర్మ ఔట్ చేసింది. అదే ఓవర్లో ఎరిన్ బర్న్స్ (12) కూడా క్లీన్ బౌల్డ్ అయింది. 18వ ఓవర్లో తొలి బంతికి వికెట్ కీపర్ రిచా ఘోష్ (1) రనౌట్ అయింది. 

చివరి రెండు ఓవర్లలో బెంగళూరు రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎక్లిస్టోన్ వేసిన చివరి ఓవర్లో రెండో బంతికి రేణుకా (3), మూడో బంతికి సహాన పవార్ (0) లు ఔటయ్యారు. ఫలితంగా ఆర్సీబీ 138 పరుగులకే పరిమితమైంది. యూపీ బౌలర్లలో ఎక్లిస్టోన్ నాలుగు వికెట్లు తీయగా దీప్తి శర్మ 3 వికెట్లు దక్కించుకుంది.