బంగ్లాదేశ్‌పై 59 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న భారత మహిళా జట్టు... సెమీ ఫైనల్ రేసులో మరింత ముందుకి... షెఫాలీ వర్మ ఆల్‌రౌండ్ షో...

వుమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీలో భారత మహిళల జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత మళ్లీ బంగ్లాదేశ్‌పై విజయాన్ని అందుకుంది వుమెన్స్ టీమిండియా. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న భారత మహిళా జట్టు, సెమీ ఫైనల్‌ రేసుకి చేరువైంది. గ్రూప్ స్టేజీలో అక్టోబర్ 10న థాయిలాండ్‌తో ఆఖరి మ్యాచ్ ఆడే భారత మహిళలు, ఆ మ్యాచ్ గెలిస్తే మిగిలిన టీమ్స్ లెక్కలతో సంబంధం లేకుండా నేరుగా సెమీ ఫైనల్ చేరుకుంటుంది...

160 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన బంగ్లాదేశ్ మహిళా జట్టు, 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులకి పరిమితమైంది. ఓపెనర్లు తొలి వికెట్‌కి 45 పరుగుల భాగస్వామ్యం అందించినా ఆ తర్వాత కెప్టెన్ సుల్తానా 36 పరుగులతో రాణించినా మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ పెద్దగా రాణించకపోవడంతో ఏ దశలోనూ లక్ష్యంవైపు సాగలేదు బంగ్లాదేశ్...

ఫర్గానా హక్ 40 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేయగా ముర్సీదా ఖటున్ 25 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసింది. కెప్టెన్ నిగర్ సుల్తానా 29 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేయగా రినూ మోనీ 4, ఫహీమా ఖటున్ 1, లతా మొండల్ 1 పరుగు చేసి అవుట్ కాగా రుమానా అహ్మద్ డకౌట్ అయ్యింది.

భారత బౌలర్లలో దీప్తి శర్మ, షెఫాలీ వర్మ రెండేసి వికెట్లు తీయగా రేణుకా సింగ్, స్నేహ్ రాణా చెరో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగుల స్కోరు చేసింది.తొలి వికెట్‌కి భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ కలిసి 96 పరుగుల భాగస్వామ్యం అందించారు...

టీ20ల్లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ మధ్య ఇది 10వ 50+ భాగస్వామ్యం. టీమిండియా తరుపున ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి టీ20 ఓపెనింగ్ జోడీగా నిలిచారు షెఫాలీ, స్మృతి మంధాన...

40 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న షెఫాలీ వర్మ, అతి పిన్న వయసులో టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. షెఫాలీ వర్మ వయసు ప్రస్తుతం 18 ఏళ్ల 253 రోజులు. ఇంతకుముందు 21 ఏళ్ల 32 రోజుల వయసులో భారత యంగ్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ ఫీట్ సాధించింది. 

38 బంతుల్లో 6 ఫోర్లతో 47 పరుగులు చేసిన స్మృతి మంధాన రనౌట్ కాగా 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసిన షెఫాలీ వర్మను రుమాన అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేసింది...

7 బంతుల్లో 4 పరుగులు చేసిన రిచా ఘోష్ నిరాశపరచగా ఆ తర్వాతి బంతికే కిరణ్ నవ్‌గిరే గోల్డెన్ డకౌట్ అయ్యింది. దీప్తి శర్మ 5 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో అవుట్ కాగా బీభత్సమైన ఫామ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ 24 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది...

ఐదు మ్యాచుల్లో 4 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకుంది. అయితే ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే మిగిలిన జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా టాప్ 2లో సెమీస్ చేరుతుంది భారత మహిళా జట్టు...