WTC Finals 2023: ఈ ఏడాది  అత్యంత దారుణ ఫామ్ తో తంటాలు పడుతున్న  సూర్యకుమార్ యాదవ్  కు కష్టకాలం మొదలైనట్లే.. వరల్డ్ టెస్ట్  ఛాంపియన్‌షిప్  కోసం బీసీసీఐ మరో వెటరన్  ను బ్యాకప్ గా ఉంచనుంది.

టీమిండియా వెటరన్ బ్యాటర్, టెస్టులలో మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే బంపరాఫర్ కొట్టాడు. ఐపీఎల్ లో ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న రహానే... కొద్దిరోజుల క్రితం ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో వీరవిహారం చేయడంతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. రెండ్రోజుల క్రితం చెన్నై - రాజస్తాన్ మధ్య చెపాక్ లో జరిగిన మ్యాచ్ లో కూడా ఫర్వాలేదనిపించాడు. బెన్ స్టోక్స్ స్థానంలో ఆడుతున్న రహానే.. అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఈ మెరుపులకు తోడు దేశవాళీ క్రికెట్ లో కూడా నిలకడగా ఆడుతుండటంతో రహానే మళ్లీ టీమిండియాలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ మేరకు అన్నీ కలిసొస్తున్నాయి. 

ఈ ఏడాది భారత జట్టు ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ ఫైనల్స్) ఆడనుంది. ఆస్ట్రేలియాతో జరుగబోయే ఈ మ్యాచ్ కు భారత జట్టు దాదాపు బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆడిన జట్టునే పంపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఇందులో రెండు మూడు మార్పులు జరుగనున్నాయి. 

సున్నాలు చుడుతున్న సూర్య.. 

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్.. ఒక్క నాగ్‌పూర్ టెస్టులో మాత్రమే ఆడాడు. ఆ మ్యాచ్ లో కూడా అలా వచ్చి ఇలా వెళ్లాడు. ఇక వన్డే సిరీస్ లో అయితే ఆడిన మూడు వన్డేలలోనూ సున్నాలు చుట్టాడు. పోని వన్డేలకు పనికిరాడు ఐపీఎల్ లో అయినా ఫామ్ లోకి వస్తాడనుకుంటే ఇక్కడా అదే కథ. సూర్య ఆడిన గత ఆరు ఇన్నింగ్స్ లలో ఏకంగా నాలుగు గోల్డెన్ డకౌట్స్ ఉన్నాయి. ఇదీగాక సూర్య.. ఢిల్లీతో మ్యాచ్ లో అక్షర్ పటేల్ ఇచ్చిన క్యాచ్ పట్టబోయి కంటికి గాయమైంది. 

అయ్యర్ కు గాయం.. 

సూర్యతో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయంతో త్వరలోనే సర్జరీకి వెళ్లనున్నాడు. అతడు ఐపీఎల్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో కూడా దూరమయ్యాడు. దీంతో టీమిండియా మిడిలార్డర్ లో నిఖార్సైన బ్యాటర్ లేక కష్టాలు ఎదుర్కోక తప్పని పరిస్థితి.

Scroll to load tweet…

రహానే రావాల్సిందే.. 

సూర్య ఫామ్ కోల్పోయినా కెఎల్ రాహుల్ ను ఆడిద్దామనుకున్నా అతడి ఫామ్ కూడా అంత గొప్పగా ఏం లేదు. కానీ వికెట్ కీపర్ కోటాలో అతడు తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ అతడు ఆడినా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. రాహుల్ కంటే ముందు కోహ్లీ తర్వాత వచ్చే ఆటగాడి స్థానంలో రహానే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. గతంలో ఇదే స్థానంలో వచ్చి రహానే కీలక ఇన్నింగ్స్ లు ఆడినవాడే. ఇంగ్లాండ్ లో ఆడిన అనుభవం కూడా రహానేకు ఉంది. 

దేశవాళీ సీజన్ లో భాగంగా గత రంజీ ట్రోఫీలో రహానే.. ముంబై తరఫున 7 మ్యాచ్ లలో 634 రన్స్ చేశాడు. 57 సగటుతో రాణించిన రహానే.. 7 మ్యాచ్ లలో ఓ డబుల్ సెంచరీ, సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. దీనికి తోడు ఐపీఎల్ ప్రదర్శనలు కూడా కలిసొచ్చేవే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా రహానేను రెడ్ బాల్ తో ప్రాక్టీస్ చేయాలని సూచించినట్టు సమాచారం. ఇదే జరిగితే 18 నెలల విరామం తర్వాత రహానే మళ్లీ భారత జట్టులోకి అడుగుపెట్టనున్నాడు.