అతడిని ఇంకెప్పుడు గుర్తిస్తారు..? బీసీసీఐపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. సంజూ శాంసన్ కు న్యాయం చేయాలంటూ డిమాండ్
Justice For Sanju Samson: ఐపీఎల్ లో వరుస సీజన్లలో అదరగొడుతున్నా.. దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నా బీసీసీఐ మాత్రం సంజూ శాంసన్ పై దయ చూపడం లేదు. దీంతో అభిమానులు.. అతడిని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
భారత్ లో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. గుర్తించాలే గానీ జిల్లాకో సచిన్ టెండూల్కర్ దొరుకుతాడు. అయితే వాళ్లంతా టీమిండియా తుది జట్టులోకి చోటు దక్కించుకోవడమే కష్టం. రంజీలు, ముస్తాక్ అలీ టోర్నీలు వంటి దేశవాళీ టోర్నీలతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-IPL) వంటి క్యాష్ రిచ్ లీగ్స్ లో నిరూపించుకున్నా తుది జట్టులో చోటు దక్కడం గగనమే. ప్రస్తుతానికి ఐపీఎల్ వరుస సీజన్లలో అదరగొడుతున్నా.. రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals) కెప్టెన్ సంజూశాంసన్ (Sanju Samson) ది ఇదే పరిస్థితి. ఐపీఎల్ లో రాణిస్తున్నా, దేశవాళీ క్రికెట్ లో నిలకడగా ఆడుతున్నా తుది జట్టులో శాంసన్ కు ఎప్పుడూ మొండిచేయే. న్యూజిలాండ్ తో త్వరలో జరుగనున్న మూడు టీ20ల సిరీస్ లో కూడా శాంసన్ కు చోటు దక్కలేదు. దీంతో అతడిని ఇంకెప్పుడు గుర్తిస్తారు..? అని క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ట్విట్టర్ వేదికగా.. ‘జస్టిస్ ఫర్ సంజూ శాంసన్’ (Justice For Sanju Samson) కు మద్దతుగా నిలుస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ-BCCI)ని నిలదీస్తున్నారు.
ప్రపంచకప్ ముగిశాక (నవంబర్14) మరో మూడు రోజులకే న్యూజిలాండ్ జట్టు.. (India Vs New zealand) మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడటానికి భారత్ కు రానున్నది. ఈ మేరకు ఇప్పటికే టీ20 సిరీస్ నిమిత్తం బీసీసీఐ.. మంగళవారం 16 మందితో కూడిన తుది జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ (Rohit sharma) సారథ్యంలోని ఈ జట్టులో ఐపీఎల్ లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ లకు చోటు దక్కింది. కానీ సంజూ శాంసన్ కు మాత్రం ఎప్పటిలాగే సెలక్టర్లు మొండిచేయి చూపించారు. వికెట్ కీపర్ అయిన శాంసన్ కు రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్నది.
శాంసన్.. ప్రస్తుతం సయ్యీద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ తరఫున ఆడుతున్నాడు. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్-14లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా ఉండి 14 మ్యాచులాడి 484 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సగటు 136.72 గా ఉంది. కొద్దికాలంగా శాంసన్ నిలకడగా రాణిస్తున్నా తుది జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు.
ఇదీ చదవండి: Team India Squad: కివీస్ తో సిరీస్ కు సారథిగా రోహిత్ శర్మ.. ఐపీఎల్ హీరోలకు పిలుపు.. హార్ధిక్ కు మొండిచేయి
ఈ ఏడాది శ్రీలంకకు వెళ్లిన భారత జట్టు (శిఖర్ ధావన్ నేతృత్వంలో) లో సంజూ శాంసన్ కు అవకాశం దక్కింది. ఆ సిరీస్ లో మూడు టీ20 లు ఆడిన శాంసన్.. 27, 7,0 తో విఫలమయ్యాడు. ఇక ఒక వన్డేలో 46 పరుగులు చేశాడు. కానీ రెండు, మూడు వన్డేలలో కరోనా కారణంగా ఆడలేదు.
అయితే న్యూజిలాండ్ తో సిరీస్ కు శాంసన్ ను ఎంపికచేయకపోవడంపై ఫ్యాన్స్ బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు. సంజూ కంటే తక్కువ బ్యాటింగ్ సగటు, నిలకడలేమీ ఉన్న ఆటగాళ్లను సెలెక్ట్ చేస్తూ అతడిని గుర్తించడం అన్యాయమని ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సంజూ వయసు 26 సంవత్సరాలు. అతడి ప్రతిభను వృథా చేయొద్దని బీసీసీఐ ని కోరుతున్నారు.
ఇక ఇదే విషయమై సంజూ శాంసన్ కూడా ట్విట్టర్ లో ఆసక్తికర ఫోటో పెట్టి నిరసన వ్యక్తం చేశాడు. బౌండరీ లైన్ వద్ద అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు చేస్తున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ పెట్టకపోయినా.. తాను వికెట్ కీపర్ బ్యాటర్ తో పాటు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తానని చెప్పకనే చెప్పాడు. నమ్మదగ్గ బ్యాటర్ అయిన శాంసన్.. వికెట్ కీపింగ్ తో పాటు మంచి ఫీల్డర్ గా కూడా. అయినా బీసీసీఐ నుంచి పిలుపు రాకపోవడంతో అతడు తీవ్ర నిరాశకు గురవుతున్నాడు.
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, ఆర్. అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్