Virat Kohli: సెంచరీ చేశాక ఆ బూతు పదాన్ని వాడిన కోహ్లీ.. వీడియో వైరల్
Virat Kohli: రన్ మిషీన్ విరాట్ కోహ్లీ వన్డేలలో మూడేండ్ల తర్వాత సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో భాగంగా కోహ్లీ శతకం సాధించిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత జట్టు వరుసగా రెండు వన్డేలు ఓడి సిరీస్ కోల్పోయిన తర్వాత ఆలస్యంగా మేల్కొంది. శనివారం ముగిసిన మూడో వన్డేలో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ తో పాటు కింగ్ కోహ్లీ కూడా సెంచరీతో చెలరేగాడు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ బాదగా కోహ్లీ వన్డేలలో తన 44వ సెంచరీ సాధించాడు. మూడేండ్ల తర్వాత కోహ్లీ వన్డేలలో శతకం బాదాడు.
నిన్నటి మ్యాచ్ లో శతకం సాధించిన తర్వాత కోహ్లీ.. బ్యాట్ పైకెత్తి తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న కెఎల్ రాహుల్ దగ్గరికి వస్తూ.. చాన్నాళ్ల తర్వత సెంచరీ చేసినందుకు ఓ బూతు పదాన్ని వాడాడు.
కోహ్లీ, రాహుల్ దగ్గరికి వస్తూ.. ‘Three f***ing Years Boss..’ అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. క్రికెట్ లో ‘ఎఫ్’ వర్డ్ ను వాడటం విదేశీ క్రికెటర్లకు కొత్తేంకాదు. ఫీల్డ్ లో అగ్రెసివ్ అటిట్యూడ్ తో ఉండే కోహ్లీ గతంలో కూడా ఈ పదాన్ని వాడాడు. అయితే కోహ్లీ ఇలా అనడంపై క్రికెట్ ఫ్యాన్స్ బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మూడేండ్ల తర్వాత వన్డేలలో సెంచరీ చేసినందుకు గాను కోహ్లీ తన భావాన్ని ఇలా వ్యక్తపరచాడని వీడియోను చూసిన కామెంట్స్ చేస్తున్నారు.
2019లో వెస్టిండీస్ తో వన్డేలో సెంచరీ తర్వాత కోహ్లీ మళ్లీ ఈ ఫార్మాట్ లో సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్ పర్యటన (జూన్ లో) తర్వాత కోహ్లీ కొన్ని రోజులు విరామం తీసుకుని ఆసియా కప్ (ఆగస్టులో) బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో ఆఫ్గానిస్తాన్ పై సెంచరీ చేశాడు. టీ20లలో కోహ్లీకి ఇదే తొలిసెంచరీ.
బంగ్లాదేశ్ తో రెండు వన్డేలలో విఫలమైనా మూడో మ్యాచ్ లో మాత్రం సెంచరీ చేశాడు. ఒక ఎండ్ లో ఇషాన్ కిషన్ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగితే కోహ్లీ మాత్రం మొదట నెమ్మదిగా ఆడాడు. హాఫ్ సెంచరీ వరకూ కోహ్లీ ఆట నిదానంగానే సాగింది. కానీ హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ బ్యాట్ ఝుళిపించాడు. 85 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. వన్డేలలో కోహ్లీకి ఇది 44వ సెంచరీ. 43 నుంచి 44 శతకం చేయడానికి కోహ్లీ ఏకంగా 40 నెలల సమయం తీసుకున్నాడు.
ఈ సెంచరీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ రికీ పాంటింగ్ (71 సెంచరీలు) ను అధిగమించాడు. ఇక కోహ్లీ ముందున్నది సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల రికార్డు ఒక్కటే. సచిన్.. తన కెరీర్ లో వంద సెంచరీలు చేశాడు. ఇందులో టెస్టులలో 51, వన్డేలలో 49 సెంచరీలు సాధించాడు. అయితే కోహ్లీ మాత్రం వన్డేలలో ఇప్పటికే 44 సెంచరీలు చేశాడు. మరో ఐదు సెంచరీలు చేస్తే కోహ్లీ.. వన్డేలలో సచిన్ అత్యధిక రికార్డులను బద్దలుకొడుతాడు.