టీమ్కి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత విండీస్ బోర్డుపైన ఉంటుంది... కనీసం వచ్చే పర్యటనలో అయినా ఇబ్బందులు లేకుండా ఉంటే బెటర్.. హార్ధిక్ పాండ్యా కామెంట్స్..
వరల్డ్లో రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ, పురుష క్రికెట్ టీమ్కి కల్పించే సౌకర్యాలు మామూలుగా ఉండవు. లగ్జరీ హోటల్స్, స్విమ్మింగ్ ఫూల్, పర్సనల్ జిమ్, ఖరీదైన ఫుడ్డు...ఇలా క్రికెటర్లు ఏది కోరితే అది నిమిషాల్లో వాళ్ల ముందు ఉంటుంది...
అందుకే సుఖాలకు బాగా అలవాటుపడిన భారత క్రికెటర్లు, వెస్టిండీస్ టూర్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఈ విషయాన్ని టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా స్వయంగా వెల్లడించాడు. ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో 200 పరుగుల తేడాతో వెస్టిండీస్పై విజయం అందుకున్న భారత జట్టు, 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది..
‘మేం ఇప్పటిదాకా ఆడిన గ్రౌండ్లలో ఇది చాలా బాగుంది. ఈసారి వెస్టిండీస్కి వచ్చినప్పుడైనా పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉంటాయని ఆశిస్తున్నాం. ట్రావెలింగ్ నుంచి మేనేజింగ్ దాకా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. గత ఏడాది వెస్టిండీస్కి వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి..
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నుంచి మేం లగ్జరీ సౌకర్యాలు ఆశించడం లేదు. అయితే ఓ జట్టు, పర్యటనకు వచ్చినప్పుడు ఆ టీమ్కి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత విండీస్ బోర్డుపైన ఉంటుంది. వెస్టిండీస్కి రావడం నాకు ఎంతో ఇష్టం. ఇక్కడ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వెస్టిండీస్లో క్రికెట్ ఆడడాన్ని కూడా చాలా ఎంజాయ్ చేశాను.. అయితే చిన్న చిన్న ఇబ్బందులు చాలా చిరాకు పెడతాయి..’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...
అయితే ఆటగాళ్లకు జీతాలు కూడా చెల్లించలేని దారుణ పరిస్థితులను ఎదుర్కుంటోంది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్లో దారుణ ప్రదర్శన కారణంగా భారత్తో సిరీస్ కూడా విండీస్ బోర్డుకి పెద్దగా లాభాలు తెచ్చి పెట్టలేకపోతోంది. ఈ సిరీస్ని అటు టీమిండియా, ఇటు వెస్టిండీస్ ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదు.
రెండు, మూడో వన్డేల్లో కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడంతో వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలోనే బరిలో దిగింది భారత జట్టు. రెండో వన్డేలో 181 పరుగులకే కుప్పకూలి, విండీస్ చేతుల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన టీమిండియా, మూడో వన్డేలో 200 పరుగుల తేడాతో గెలిచి... సూపర్ కమ్బ్యాక్ ఇచ్చింది..
ఐదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన హార్ధిక్ పాండ్యా 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. మూడు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలవగా, మూడో వన్డేలో 85 పరుగులు చేసిన శుబ్మన్ గిల్కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది..
వెస్టిండీస్ టూర్లో భాగంగా ఆగస్టు 3 నుంచి టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. వన్డే సిరీస్ ఆడిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జయ్దేవ్ ఉనద్కట్... స్వదేశానికి తిరిగి వెళ్లిపోబోతున్నారు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్, యజ్వేంద్ర చాహాల్, రవి భిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్లకు టీ20 సిరీస్లో చోటు దక్కింది..
