TATA IPL2022: గతేడాది దుబాయ్ వేదిగకా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు గ్రూప్ స్టేజ్ నుంచే  ఇంటి బాట పట్టింది. అయితే ఆ టోర్నీలో యార్కర్ల కింగ్ నటరాజన్ సేవలను  భారత జట్టు కోల్పోయిందని.. అతడుంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. 

దుబాయ్ వేదికగా గతేడాది అక్టోబర్-నవంబర్ లో ముగిసిన టీ 20 ప్రపంచకప్ లో భారత జట్టు పేలవమైన ఆటతీరుతో కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటకుండానే ఢిల్లీ విమానమెక్కింది. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచులు (పాకిస్తాన్, న్యూజిలాండ్) దారుణంగా ఓడిన ఇండియా తర్వాత పుంజుకున్నా లాభం లేకుండా పోయింది. అయితే టీమిండియాకు సరైన బౌలింగ్ కూర్పు లేక టోర్నీ నుంచి నిష్క్రమించిందనేది కండ్ల ముందు కనబడిన వాస్తవం. అయితే భారత యువ బౌలర్, యార్కర్ల కింగ్ గా పేరొందిన టి.నటరాజన్ ఉంటే భారత పరిస్థితి మరో విధంగా ఉండేదని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పాడు. 

ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న నట్టూ.. సోమవారం లక్నోతో ముగిసిన మ్యాచ్ లో రెండు వికెట్లు తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఓ క్రీడా ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచకప్ లో నటరాజన్ సేవలను కోల్పోయాం. నట్టూ ఫిట్ గా ఉంటే కచ్చితంగా జట్టులో ఉండేవాడు. 

ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో నటరాజన్ గాయపడి జట్టుకు దూరమయ్యాడు. నట్టూ డెత్ ఓవర్ల స్పెషలిస్టు. యార్కర్లను అద్భుతంగా విసరగలడు. అంతేగాక తన పేస్, లెంగ్త్ బంతులతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టగల సమర్థుడు. నట్టూను జట్టులోకి ఎంపిక చేసిన ప్రతిసారి అతడు మంచి ప్రదర్శన చేశాడు. తద్వారా భారత్ కూడా విజయాలు సాధించింది. 

Scroll to load tweet…

అతడు మళ్లీ తిరిగి రావడం సంతోషంగా ఉంది. అతడి అరంగేట్ర టీ20 మ్యాచ్ తో పాటు మొదటి టెస్టు లో కూడా భారత్ కు విజయం అందింది. నట్టూ నా నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు. నటరాజన్ నెట్ బౌలర్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదగడం గర్వించదగ్గ విషయం..’ అని రవిశాస్త్రి తెలిపాడు. 

Scroll to load tweet…

కాగా.. గతేడాది ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డ నటరాజన్.. 12 నెలల తర్వాత మళ్లీ ఇటీవలే గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. ఇటీవలే ముగిసిన వేలం ప్రక్రియలో ఎస్ఆర్హెచ్ అతడిని రూ. 4 కోట్లతో రిటైన్ చేసుకుంది. లక్నోతో మ్యాచులో నట్టూ.. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సోమవారం నట్టూ బర్త్ డే..