బంతి బౌండరీ దాటాల్సిందే అన్నట్లు ఆడే సెహ్వాగ్‌ కెరీర్‌లో పాకిస్తాన్‌ గడ్డపై నెలకొల్పిన అరుదైన రికార్డు ఎప్పటికి పదిలం. 2004లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలో పాకిస్తాన్‌లో పర్యటించిన భారత జట్టు, నాటి టెస్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌‌ తన కెరీర్‌లో జట్టుకు ఎన్నో చిరస్మణీయమైన విజయాలను అందించాడు. ఎదుటి బౌలర్ ఎలాంటి వాడైనా సరే.. బంతి బౌండరీ దాటాల్సిందే అన్నట్లు ఆడే సెహ్వాగ్‌ కెరీర్‌లో పాకిస్తాన్‌ గడ్డపై నెలకొల్పిన అరుదైన రికార్డు ఎప్పటికి పదిలం.

2004లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలో పాకిస్తాన్‌లో పర్యటించిన భారత జట్టు, నాటి టెస్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇందులో భాగంగా, ముల్తాన్‌ టెస్టు (మార్చి 28)లో వీరేంద్ర సెహ్వాగ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ట్రిపుల్‌ సెంచరీ (309 పరుగులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. తద్వారా ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్‌ చరిత్రకెక్కాడు.

ఇక ఆ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌పై ఇన్నింగ్స్‌ 52 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తన తొలి ట్రిపుల్‌ సెంచరీకి 17 ఏళ్లు నిండిన సందర్భంగా సెహ్వాగ్‌ ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.

‘‘మార్చి 29.. నాకు ఎంతో ప్రత్యేకమైన తేదీ... భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలి ట్రిపుల్‌ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా గౌరవం లభించిందని వీరూ చెప్పారు. అయితే యాధృచ్చికంగా సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే రోజున దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేశాను అంటూ పాత వీడియోను షేర్‌ చేశాడు. 

Scroll to load tweet…