టీమ్ లో ఉన్నన్ని రోజులూ వీడెక్కడున్నా రాజేరా..! మళ్లీ కెప్టెన్ గా కింగ్ కోహ్లి..?
IND vs ENG: ఇంగ్లాండ్ తో గతేడాది మిగిలిపోయిన ఐదో టెస్టు ఆడేందుకు గాను భారత జట్టు ప్రస్తుతం యూకేలో ఉంది. ఈనెల 24 నుంచి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
‘ప్రాణాలతో ఉన్నన్ని రోజులు వీడెక్కడున్నా రాజేరా..’ అంటూ బాహుబలిలో నాజర్.. ప్రభాస్ రాజ్యం వదిలి వచ్చాక చూసి చెప్పే డైలాగ్ ఇది. మాహిష్మతిని వదిలి సామాన్య ప్రజలతో జీవిస్తున్నా వాళ్లతో కలుపుగోలుగా ఉండటమే గాక ప్రజల సమస్యలను తీరుస్తూ కనిపించడంతో నాజర్ ఈ మాట చెబుతాడు. ఇప్పుడు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి కూడా ఇదే ఆపాదిస్తున్నారు అతడి అభిమానులు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లి కొంతసేపు మళ్లీ తన పాత పాత్ర పోషించాడు. జట్టుకు స్ఫూర్తివంతమైన స్పీచ్ ఇచ్చాడు.
ఇంగ్లాండ్ తో ఐదో టెస్టుకు ముందు భారత జట్టు లీన్స్టర్షైన్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. జులై 1-4 మధ్య ఐదో టెస్టుకు ముందు ఈనెల 24 నుంచి లీన్స్టర్షైన్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి కొద్దిసేపు తిరిగి సారథి అయ్యాడు.
టీమిండియా హెచ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అభ్యర్థన మేరకు కోహ్లి.. జట్టును ఉద్దేశిస్తూ స్పూర్తివంతమైన స్పీచ్ ఇచ్చాడు. వారిలో స్పూర్తిని రగిలించాడు. గతేడాది భారత జట్టు ఇంగ్లాండ పర్యటనకు వచ్చినప్పుడు భారత జట్టు.. ఆడిన నాలుగు టెస్టులలో 2-1 తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కోహ్లి కెప్టెన్ గా కాక బ్యాటర్ గా బరిలోకి దిగుతున్నాడు.
కాగా కోహ్లి ఇచ్చిన స్పీచ్ కు సంబంధించిన వీడియోను లీన్స్టర్షైన్ ఫోక్సెస్ ట్విటర్ లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన టీమిండియా, కోహ్లి అభిమానులు.. ‘జట్టులో కెప్టెన్ గా ఉన్నా లేకున్నా.. కింగ్ ఎప్పటికీ కింగే..’ అని కామెంట్ చేస్తున్నారు. కోహ్లి ఈ స్పీచ్ ఇస్తున్నప్పుడు రాహుల్ ద్రావిడ్ తో పాటు పక్కనే టీమిండియా ప్రస్తుత సారథి రోహిత్ శర్మ కూడా ఆసక్తిగా అతడి ప్రసంగం వింటుండటం గమనార్హం.
మరో 40 పరుగులు చేస్తే..
ఇంగ్లాండ్ పై ఎడ్జబాస్టన్ వేదికగా జులై 1 నుంచి జరుగబోయే ఐదో టెస్టులో కోహ్లి గనక 40 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ పై 2వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం అతడు రాహుల్ ద్రావిడ్ (1,950 రన్స్) ను దాటేశాడు.