విచిత్రం: యువీ తండ్రి యూటర్న్... ధోనిపై ప్రశంసల వర్షం
మహేంద్ర ధోని అంటే ద్వేషించే వారిలో మాజీ టీమిండియా ప్లేయర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ ముందుంటాడు. అయితే తాజాగా యోగరాజ్ ధోనిపై ప్రశంసించడం ఆరంభించారు. ధోని టీమిండియాకే కాదు భారత దేశానికి దొరికిన ఆణిముత్యం అంటూ యోగరాజ్ పొగడటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా నిలిచిన విషయం తెలిసిందే. అతడు తన కొడుకు క్యాన్సర్ కు గురయినపుడు, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించినప్పటి కంటే ఎక్కువగా వార్తల్లో నిలవడానికి కారణం సీనియర్ టీమిండియా ప్లేయర్, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని విమర్శించడమే. తన కొడుకు యువరాజ్ కెరీర్ కు ధోని అడ్డుతగిలాడని భావిస్తున్న యోగరాజ్ సింగ్ ప్రతి విషయంలోనూ అతడిపై బురదజల్లడం ఆరంభించాడు. అయితే తాజాగా ఏమయ్యిందో ఏమోగాని యోగరాజ్ ఒక్కసారిగా ధోని విషయంలో యూ టర్న్ తీసుకున్నాడు. అంతేకాకుండా అతడిపై ప్రశంసల వర్షం కురిపించడం ఆరంభించాడు.
సారథిగా మాత్రమే కాకుండా వికెట్ కీపర్, బ్యాట్ మెన్ గా ధోని కేవలం టీమిండియా ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ఇలా అతడు కేవలం భారత జట్టునే కాదు యావత్ భారత ప్రజలను గెలిపించాడు. ధోని వల్లే 2015, 2019 ప్రపంచ కప్ ట్రోఫీ మిస్సంయిందని తాను విమర్శించినట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు.
''ధోని కొన్నేళ్లుగా ఓ క్రికెటర్ గా దేశానికి సేవ చేస్తున్నాడు. అతడో గొప్ప క్రికెటర్. నిజంగా చెప్పాలంటే ధోని ఆటంటే నాకెంతో ఇష్టం. అతడికి నేను పెద్ద అభిమానిని. కెప్టెన్ గా అతడి ఆలోచనా విధానం, జట్టును ముందుండి నడిపించడం, జట్టుకు అవసరాలను గుర్తించి ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం చాలా బాగుంటాయి. ఇక బ్యాట్ మెన్, వికెట్ కీపర్ గా అతడి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.'' అంటూ యోగరాజ్ ధోని గురించి మొదటిసారిగా పాజిటివ్ గా మాట్లాడారు.
కాశ్మీర్ లోయలో ధోని విధులు
క్రికెట్ అంటే ఇష్టపడేవారంతా తనను అభిమానిస్తుంటే ధోని మాత్రం దేశ రక్షణ కోసం పాటుపడే ఆర్మీ జవాన్లను అభిమానిస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడికి భారత ఆర్మీతో కలిసి పనిచేయాలన్న కుతూహలం పెరిగింది. ధోని ఉత్సాహాన్ని గమనించిన ఆర్మీ ఉన్నతాధికారులు అతడికి స్పోర్ట్స్ కోటాలో లెప్టినెంట్ కల్నల్ హోదాను కల్పించారు.
ఇలా బెంగళూరు హెడ్ క్వార్టర్ గా పనిచేసే పారాచూట్ రెజిమెంట్ లో చేరిన ధోని 2015 నుండి ఇప్పటివరకు ఐదుసార్లు పారాచూట్ జంపింగ్ లో పాల్గొన్నాడు. ఇలా ఆగ్రా ట్రెయినింగ్ క్యాంప్ లో ఆర్మీ విమానం పై నుండి దూకి ధోని అధికారికంగా పారాట్రూపర్ గా మారాడు. అయితే దేశ రక్షణ కోసం పనిచేయాలన్న దృడసంకల్పంతో తాజాగా అతడు వెస్టిండిస్ పర్యటనకు వెళ్లకుండా రెండు నెలల పాటు ఆర్మీలో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 31వ తేదీ నుండి ధోని తన యూనిట్ సభ్యులతో కలిసి అత్యంత ప్రమాదకరమైన కాశ్మీర్ లోయలో విధులు నిర్వహించనున్నాడు.