యూఏఈలో పెరుగుతున్న కరోనా కేసులు: పరిస్థితి చేయి దాటితే ఐపీఎల్ ఎలా..?
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కావడానికి కేవలం నెల రోజులే సమయం వుంది
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కావడానికి కేవలం నెల రోజులే సమయం వుంది.
ఇందులో పాల్గొనేందుకు అన్ని జట్లు సమాయత్తమవుతున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు గురువారం ఉదయం దుబాయ్కు బయల్దేరగా... మిగతా జట్లు కూడా త్వరలోనే దుబాయ్కు చేరుకోనున్నాయి.
అయితే గత కొద్దిరోజులుగా యూఏఈలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 365 కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ కేసులు అనూహ్యంగా పెరిగితే ఐపీఎల్ పరిస్థితి ఏంటని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇప్పటి వరకు యూఏఈలో 64,906 కేసులు నమోదు కాగా.. 366 మరణాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్లో మ్యాచ్లు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి.
షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా జరగనున్న మ్యాచ్లను బయో సెక్యూర్ పద్ధతిలో నిర్వహించనున్నారు. అంతేకాకుండా లీగ్లో పాల్గొనబోతున్న ఆటగాళ్లందరికీ కఠిన నిబంధనలు వర్తింపజేయనున్నారు.
ప్రతీ ఆటగాడికి రెండు సార్లు కరోనా టెస్టులు అయ్యాకే అనుమతించనున్నారు. కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే విమానం ఎక్కేందుకు పర్మిషన్ ఇవ్వనున్నారు. మ్యాచ్ ఓడినా, గెలిచినా ఆటగాళ్ల మధ్య ఎలాంటి షేక్ హ్యాండ్స్కు తావులేదు.