తిలక్ వర్మ సూపర్ షో.. సయీద్ ముస్తాక్ అలీ ట్రోపీలో హైదరాబాద్కు తొలి విజయం..
SMAT 2022 : దేశవాళీ టీ20 జాతర సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తొలి విజయం నమోదు చేసింది. రాజస్తాన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విజయంలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు.
ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున నిలకడైన ప్రదర్శనలతో ఆకట్టుకున్న యువ బ్యాటర్ తిలక్ వర్మ సయీద్ ముస్తాక్ అలీ (స్మాట్) టీ20 ట్రోఫీలో కూడా అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. స్మాట్ టోర్నీలో భాగంగా పుదుచ్చేరితో ముగిసిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించడమే గాక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాజస్తాన్ లోని సవాయి మాన్ సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా బుధవారం ముగిసిన గ్రూప్ స్టేజ్ 23వ మ్యాచ్ లో తిలక్ వర్మ.. 41 బంతుల్లో 1 ఫోర్, నాలుగు సిక్సర్లతో 57 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. హైదరాబాద్ ఓపెనర్ , కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (33) తో పాటు తిలక్ వర్మ రాణించారు. వీరితో పాటు చివర్లో మికిల్ జైస్వాల్ (25 బంతుల్లో 44 నాటౌట్, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో హైదరాబాద్.. 147 పరుగులు చేసింది.
అనంతరం పుదుచ్చేరి.. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. పుదుచ్చేరి బ్యాటర్లలో రామచంద్రన్ రఘుపతి (35), పరమేశ్వరన్ (32), మోహిత్ మిట్టన్ (28) లు రాణించినా వాళ్లు తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. వికెట్ల వేటలో హైదరాబాద్ బౌలర్లు వెనుకబడ్డా చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
గ్రూప్ స్టేజ్ లో భాగంగా పంజాబ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో హైదరాబాద్ దారుణంగా ఓడింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్.. 18.4 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో కూడా తిలక్ వర్మ (50) హాఫ్ సెంచరీతో మెరిసినా మ్యాచ్ గెలిపించలేకపోయాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో హైదరాబాద్ తర్వాత మ్యాచ్.. రేపు (అక్టోబర్ 14) గోవా తో తలపడనుంది.