Virat Kohli vs Rohit Sharma: కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కోహ్లి-రోహిత్ శర్మ అభిమానులకు మళ్ల పని కల్పించాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. అతడు చేసిన ఓ ట్వీట్ ఇరు ఆటగాళ్ల ప్యాన్స్ మధ్య చిచ్చు రేపింది.
టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సారథ్యంలోని టీమిండియా వరుస విజయాలతో ఓటమనేదే లేకుండా దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఇద్దరి కలయికలో భారత జట్టు అద్భుతాలు చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఊటంకిస్తూ భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కూడా ఓ ట్వీట్ చేశాడు. అయితే హిట్ మ్యాన్, రాహుల్ ద్రావిడ్ లపై ప్రశంసలు చేస్తూ చేసిన ట్వీట్ కాస్తా కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో కైఫ్ ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.
ఇంతకూ ఏం జరిగిందంటే...? లంకతో రెండు టెస్టుల సిరీస్ ముగిసిన అనంతరం కైఫ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘కెఎల్, రోహిత్, విరాట్, అయ్యర్, పంత్, జడేజా, అశ్విన్, బుమ్రా, షమీ.. తుది జట్టు కోసం విరివిగా ఆప్షన్లు.. అకస్మాత్తుగా చూస్తే అంతా బాగానే ఉంది. రోహిత్-ద్రావిడ్ నేతృత్వంలోని భారత జట్టు.. అత్యుత్తమ టెస్టు జట్టుగా రూపాంతరం చెందుతున్నది..’ అని పేర్కొన్నాడు.
ఈ ట్వీట్ విరాట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. రవిశాస్త్రి-కోహ్లి శ్రమను తక్కువగా చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ టీమ్ ను తయారుచేసిందే రవిశాస్త్రి-కోహ్లి అని.. ఆ ఫలాలను రోహిత్-ద్రావిడ్ అనుభవిస్తున్నారని కామెంట్లు చేశారు. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కోహ్లి-రోహిత్ శర్మ అభిమానుల మధ్య మళ్లీ ట్విట్టర్ యుద్దానికి తెరతీసినట్టైంది.
ట్విట్టర్ ట్వీట్స్ కు సంబంధించిన పలు అభిప్రాయాలను ఇక్కడ చూద్దాం.. ‘ప్రస్తుత జట్టును కోహ్లి-శాస్త్రి లు కలిసి తయారుచేశారు. హనుమ విహారి నుంచి అక్షర్ పటేల్ వరకు అంతా కోహ్లి నాయకత్వంలో అరంగేట్రం చేసిన వారే.. ’, ‘ఆర్సీబీ లో కోహ్లి కెప్టెన్ అయ్యాక ఆ జట్టు నుంచి బయటకువచ్చిన కైఫ్.. ఇలా మాట్లాడుతున్నాడు..’, ‘ఇదే జట్టు కోహ్లి నాయకత్వంలో కూడా అద్భుతాలు చేసింది. ఇందులో కొత్తేమీ లేదు. అయితే కోహ్లి-శాస్త్రి ల కాలంలో రహానే-పుజారాలను తప్పించకపోవడం, అశ్విన్ ను సరిగా ఉపయోగించుకోకపోవడం తప్పితే వాళ్లు జట్టును బాగా తయారుచేశారు..’, ‘విరాట్-శాస్త్రి టైమ్ లోనే జట్టుకు ఒక రూపం వచ్చింది. ఇది కోహ్లి జట్టు. ర్యాంకింగ్స్ లో ఏడో స్థానంలో ఉన్న టీమిండియాను కోహ్లి అగ్రస్థానానికి తీసుకువచ్చాడు..’, ‘ఏం మాట్లాడుతున్నావ్ కైఫ్.. ఈ జట్టును కోహ్లి-శాస్త్రిలు తయారుచేశారు. రోహిత్ కేవలం ఆ ఫలాలను అనుభవిస్తున్నాడు. అదీగాక సిరీస్ జరిగింది శ్రీలంకమీద.. ఇదేదో పెద్ద ఆసీస్, న్యూజిలాండ్ మీద గెలిచినట్టు చెప్తావేంటి..?’ అని చురకలంటించారు.
కోహ్లి అభిమానుల అభిప్రాయాలు ఇలా ఉంటే.. మరోవైపు రోహిత్ శర్మ ఫ్యాన్సేమో... ‘మరి దక్షిణాఫ్రికా లో ఏమైంది..?’, ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఏం చేశారు మీ కోహ్లి-శాస్త్రి..’ అంటూ కౌంటర్లు పెడుతున్నారు.
