రాజీనామా చేసిన పూర్తి స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు... జాతివివక్ష ఆరోపణలతో సంచలన నిర్ణయం...
Scotland Cricket: సొంత టీమ్మేట్స్ నుంచి జాతివివక్ష ఎదుర్కొన్నట్టుగా సంచలన ఆరోపణలు చేసిన స్కాట్లాండ్ క్రికెటర్లు మజీద్ హక్, ఖాసీం షేక్...
సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ను కుదిపేసిన జాతి వివక్ష, ఇప్పుడు స్కాట్లాండ్ క్రికెట్ జట్టులోనూ చిచ్చు రేపుతోంది. జాతి వివక్ష ఆరోపణలు రావడంతో స్కాట్లాండ్ క్రికెట్ బోర్డులోని ఆరుగురు సభ్యులందరూ ఆదివారం జూలై 24న రాజీనామాలు సమర్పించారు.
స్కాట్లాండ్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్న మజీద్ హక్, స్కై స్పోర్ట్స్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు, ఆ దేశ క్రికెట్ బోర్డులో చిచ్చు రేపాయి. స్కాట్లాండ్ బోర్డు సభ్యులు, ప్లేయర్లపై జాత్యాహంకారాన్ని చూపిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మజీద్ హక్...
స్కాట్లాండ్ మాజీ క్రికెటర్ ఖాసీం షేక్ కూడా తాను కూడా జాతివివక్షను ఎదుర్కొన్నట్టు కామెంట్ చేశాడు. నల్లజాతీయులం కావడంతో మిగిలిన టీమ్ మేట్స్, తమని వేరుగా చూసేవాళ్లని ఆరోపించాడు ఖాసీం షేక్... ఈ ఆరోపణలు వచ్చిన గంటల వ్యవధిలోనే స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సభ్యులందరూ మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించడం విశేషం...
బోర్డు డైరెక్టర్, తన రాజీనామాని తాత్కాలిక సీఈవోకి పంపించారు. ‘ది బోర్డు ఆఫ్ క్రికెట్ స్కాట్లాండ్ మొత్తం రాజీనామా చేశారు. స్పోర్ట్స్ స్కాట్లాండ్తో కలిసి పని చేసి ఓ సముచిత పాలన, నాయకత్వం కలిగిన బోర్డును తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఆటలో జాతి వివక్షను సహించేది లేదు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు...’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది క్రికెట్ స్కాట్లాండ్..
ఇప్పటిదాకా జాతివివక్ష ఆరోపణలపై వచ్చిన రివ్యూ రిపోర్టును బోర్డు సమీక్షించలేదు. అయితే టీమ్ సెలక్షన్ విషయంలో, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రవర్తన గురించి తప్పనిసరి తీసుకోవాల్సిన కొన్ని చర్యల గురించి ఇప్పుడు మార్పులు చేసే పనిలో పడింది స్పోర్ట్స్ స్కాట్లాండ్...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో అద్భుతమైన ఆటతీరు కనబర్చింది స్కాట్లాండ్. గ్రూప్ స్టేజీలో ఓమన్, పపువా న్యూ గినీ, బంగ్లాదేశ్లను ఓడించి టేబుల్ టాపర్గా సూపర్ 12 రౌండ్కి ప్రవేశించింది స్కాట్లాండ్. అయితే సూపర్ 12 రౌండ్లో గ్రూప్ స్టేజీలో చూపించిన దూకుడును చూపించలేకపోయింది స్కాట్లాండ్...
న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్ వరకూ పోరాడి 16 పరుగుల తేడాతో ఓడిన స్కాట్లాండ్, భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కూడా అర్హత సాధించిన స్కాట్లాండ్, గ్రూప్ స్టేజీలో వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వేలతో సూపర్ 12 బెర్త్ కోసం పోటీపడనుంది.