రోహిత్ ఆశలు గళ్లంతు... కోహ్లీ వైపే టీమిండియా సెలెక్టర్లు...?
వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సిద్దమయ్యాడు. దీంతో విండీస్ పర్యటనలో కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం వస్తుందనుకున్న రోహిత్ శర్మ ఆశలు గళ్లంతయ్యాయి.
ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ టోర్నీ తర్వాత టీమిండియా మొదటిసారిగా వెస్టిండిస్ సీరిస్ లో పాల్గొననుంది. వచ్చే నెల(ఆగస్ట్ 2019) నుండి భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య రెండు టెస్టులు, 3వన్డేలు, 3 టీ20 మ్యాచులతో సీరిస్ లు జరగనున్నాయి.
అయితే ఈ పర్యటన నుండి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని బిసిసిఐ భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇదే జరిగితే విండీస్ పర్యటన మొత్తానికి టీమిండియా సారథిగా రోహిత్ శర్మ వ్యహరించేవాడు. ఇదే జరిగితే తన కెప్టెన్సీకి శాశ్వతంగా ముప్పు పొంచివుందని గుర్తించాడో ఏమోగానీ కోహ్లీ వెస్టిండిస్ పర్యటనకు వెళ్లేందుకు సిద్దమయ్యాడు.
కోహ్లీ రెడీ...
బోర్డు సూచన ప్రకారం తాను విశ్రాంతి కోరుకోవట్లేదు...కాబట్టి కరీబియన్ గడ్డపై జరిగే సీరిస్ కు తాను అందుబాటులో వుంటానని కోహ్లీ సెలక్షన్ కమిటీకి సమాచారం ఇచ్చాడట. దీంతో ఈ విషయంపై కూడా ఆదివారం సెలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. అయితే కోహ్లీ అందుబాటులో వున్నానని సమాచారమిచ్చాడు కాబట్టి సెలెక్టర్లు అతన్ని పక్కనపెట్టే అవకాశాలు లేవని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే టీమిండియా జట్టులో సీనియర్లయిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో 2023 ప్రపంచ కప్ ను దృష్టిలో వుంచుకుని వన్డే ఫార్మాట్ కు రోహిత్ ను కెప్టెన్ గా చేయాలని కొందరు మాజీలు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిసిసిఐ కోరినా కోహ్లీ విశ్రాంతి తీసుకోడానికి సుముఖంగా లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.