Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన కోహ్లీ..
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 270కి పైగా మృతి చెందగా 900 మందికి గాయాలైనట్టు సమాచారం.
శుక్రవారం ఒడిషాలోని బాలాసోర్ వద్ద రెండు సూపర్ ఫాస్ట్, ఒక గూడ్స్ రైలు ఢీకొనడంతో మాటలకందని విషాదం నెలకొంది. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో జరిగిన ఘోర రైలు పట్టాలు తప్పిన ఘటనలో 280 మంది మృతి చెందగా, 900 మందికి పైగా గాయపడ్డారని ప్రస్తుతం అందుతున్న నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా ఈ దుర్ఘటనపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.
ట్విటర్ వేదికగా కోహ్లీ స్పందిస్తూ.. ‘ఒడిషాలో రైళ్లు ఢీకొన్న ప్రమాదవార్త విని నేను చాలా బాధపడ్డాను. నా ఆలోచనలన్నీ కుటుంబాలను కోల్పోయిన వారి చుట్టే ఉన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా..’అని ట్వీట్ చేశాడు.
కోల్ కతాకు దక్షిణంగా 250 కిలోమీటర్లు, భువనేశ్వర్ కు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే, ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీ ఏర్పాటును ప్రభుత్వం ప్రకటించింది.
కోరమాండల్ - యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ రైళ్లు ఢీకొనడంతో సుమారు 11 బోగీలు గాల్లోకి లేచి కిందపడ్డాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదంతో ఘటనా స్థలి వద్ద భీతావాహ దృశ్యాలు అందర్నీ కలవరపెడుతున్నాయి.