స్లో ఓవర్ రేటు కారణంగా భారత జట్టు మ్యాచ్ ఫీజులో నూరు శాతం కోత... ఆస్ట్రేలియాకి 80 శాతం మ్యాచ్ ఫీజు ఫైన్గా వేసిన ఐసీసీ... శుబ్మన్ గిల్కి 115 శాతం కోత...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో ఓడిన టీమిండియాకి మరో షాక్ ఇచ్చింది ఐసీసీ. స్లో ఓవర్ రేటు కారణంగా భారత జట్టు మ్యాచ్ ఫీజులో నూరు శాతం కోత విధించింది. కెన్నింగ్టన్లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా చేతుల్లో 209 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే...
టెస్టు ఛాంపియన్షిప్ 2023 కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా... వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టు ఛాంపియన్షిప్... ఇలా నాలుగు ఐసీసీ టైటిల్స్ కైవసం చేసుకున్న మొట్టమొదటి జట్టుగా చరిత్ర క్రియేట్ చేసింది.. అయితే ఈ మ్యాచ్లో స్లో ఓవర్ కారణంగా ఇరు జట్ల మ్యాచ్ ఫీజులో భారీ కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ...
వాతావరణం బాగా కలిసి వచ్చినా ఇటు ఇండియా, అటు ఆస్ట్రేలియా రెండూ కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాల్సిన ఓవర్లను పూర్తి చేయలేకపోయాయి. టెస్టు మ్యాచ్లో రోజుకి 90 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే తొలి రోజు 85 ఓవర్లు బౌలింగ్ చేసిన టీమిండియా, రెండో రోజు 36.3 ఓవర్లు బౌలింగ్ చేయగా ఆస్ట్రేలియా 38 ఓవర్లు బౌలింగ్ చేసింది..
తొలి రోజు 5 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేయగా రెండో రోజు ఇరు జట్లు కలిసి దాదాపు 15 ఓవర్లు తక్కువగా వేశారు. మూడో రోజు టీమిండియా 31.4 ఓవర్లు బ్యాటింగ్ ఆడితే, ఆస్ట్రలియా 44 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. అంటే 90 ఓవర్లు వేయాల్సిన చోట, వేసింది 75.4 ఓవర్లే.
నాలుగో రోజు ఆస్ట్రేలియా 40.3 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే, టీమిండియా 40 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. మొత్తంగా నాలుగు రోజుల్లో కలిపి దాదాపు 45 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేశాయి ఇరు జట్లు. దీంతో స్లో ఓవర్ రేటు కింద టీమిండియాకి 100 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించిన ఐసీసీ, ఛాంపియన్ టీమ్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించింది..
భారత జట్టు నిర్ణీత సమయానికి 5 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేయగా, ఆస్ట్రేలియా 4 ఓవర్లు తక్కువగా వేసినట్టు ఐసీసీ ప్రకటించింది. అలాగే థర్డ్ అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసినందుకు శుబ్మన్ గిల్కి మరో 15 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించింది ఐసీసీ..
అంటే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ ఆడినందుకు టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్మన్ గిల్కి మ్యాచ్ ఫీజు ఒక్క రూపాయి కూడా రాదు సరి కదా.. మరో 15 శాతం మ్యాచ్ ఫీజుని జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ గెలిచిన ఆస్ట్రేలియాకి రూ.13.2 కోట్ల ప్రైజ్ మనీ అందించిన ఐసీసీ, రన్నరప్ టీమిండియాకి రూ.6.5 కోట్ల ప్రైజ్ మనీ అందించింది.
