TATA IPL 2022: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు మెంటార్ గా వ్యవహరిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గొంతు సవరించకున్నాడు. అయితే సచిన్ పాట పాడింది రికార్డింగ్ స్టూడియోలో కాదు.. ట్రాఫిక్ లో...
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ తో పాటు సంగీతమంటే చెవి కోసుకుంటాడు. ఇటీవలే మరణించిన బాలీవుడ్ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పాటలంలే సచిన్ కు ప్రాణం. లతాజీ ని ‘అమ్మ’గా భావించే సచిన్.. అప్పుడప్పుడు ఆమె పాటలు పాడుతూ హాయిగా గడుపుతుంటాడు. బాలీవుడ్ పాటలతో పాటు మరాఠీ పాటలంటే కూడా సచిన్ ఇష్టంగా వింటాడు. ముఖ్యంగా మరాఠీలో పాత పాటలను సచిన్ చాలా ఇష్టపడతాడు. గతంలో కూడా సచిన్.. సోనూ నిగమ్ తో కలిసి ఓ పాటను పాడిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అదే సచిన్.. సంగీత దిగ్గజం హేమంత్ కుమార ముఖోపాధ్యాయ్, లతా మంగేష్కర్ పాడిన ఓ పాటను పాడాడు. ట్రాఫిక్ లో చిక్కుకున్న సచిన్.. మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే తో కలిసి తన గాత్రాన్ని సవరించాడు.
తమ తదుపరి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్.. కోల్కతా నైట్ రైడర్స్ తో పోటీ పడనుంది. బుధవారం ఈ మ్యాచ్ పూణెలో జరుగనుంది. ఈ నేపథ్యంలో ముంబై నుంచి పూణేకు వెళ్తూ సచిన్.. మోరే తో కలిసి కార్లో.. హేమంత్ కుమార్ పాడిన పాటను హమ్ చేస్తూ వెళ్లాడు.
మరాఠీ సినిమా మెగర ఫులల సినిమా కోసం.. లతా మంగేష్కర్, హేమంత్ కుమార్ ముఖాపాధ్యాయ్ లు పాడిన ‘మి డోల్కర దైర్యచ రాజా...’ పాటను సచిన్ హమ్ చేశాడు. ఇది నదిలో ఒక మత్స్యకారుడు పాడుకునే పాట. సచిన్ తో పాటు కిరణ్ మోరే కూడా పాటను పాడుకుంటూ... హావభావాలను కూడా ప్రదర్శించారు.
ఈ వీడియో ను సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ.. ‘పూణెకు వెళ్తుండగా ట్రాఫిక్ లో చిక్కుకున్నాం. ఈ అందమైన పాటను వినాలనుకున్నాను...’ అని రాస్తూ ఆ పాటకు సంబంధించిన కొన్ని మరాఠీ వ్యాఖ్యలను కూడా జోడించాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.
ఇదిలాఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులలో ఓడిన ముంబై ఇండియన్స్ బుధవారం సాయంత్రం కేకేఆర్ తో పోటీ పడనుంది. ఈ సీజన్ లో ముంబై ఇంకా విజయ బోణీ చేయలేదు. మరోవైపు కేకేఆర్.. తాను ఆడిన మూడు మ్యాచులలో 2 గెలిచి ఒకటి ఓడింది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశమున్నది.
