TATA IPL 2022 Live Updates: ముంబై ఇండియన్స్ తో శనివారం జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. అయితే అతడు సెంచరీ చేయడానికి కారణాన్ని బట్లర్ వివరించాడు.
ఐపీఎల్-2022 సీజన్ లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్. ముంబై ఇండియన్స్ తో శనివారం జరిగిన మ్యాచులో బట్లర్.. 66 బంతుల్లోనే సెంచరీ బాది ఆ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే బట్లర్ సెంచరీ చేయడానికి కారణం ఆ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహలేనట. అతడి భయంతోనే బట్లర్ సెంచరీ చేశాడట. ఈ విషయాలను స్వయంగా బట్లర్ వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం బట్లర్ తో చాహల్ చేసిన ఓ ఇంటర్వ్యూలో అతడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
శనివారం ఆ జట్టు విజయానికి కారణమైన బట్లర్, చాహల్ మధ్య సంభాషణ ఇలా సాగింది. బట్లర్ ను చాహల్ ప్రశ్నిస్తూ..‘జోషి భాయ్ నువ్ బాగా బ్యాటింగ్ చేశావ్. అయితే ఎనిమిదో స్థానంలో ఉన్న నేను ఓపెనర్ గా వస్తానని నువ్వు భయపడ్డావా..? నీ పై ఒత్తిడి పెరిగిందా..?’ అని ఫన్నీగా ప్రశ్నించాడు.
దానికి బట్లర్ కూడా అంతే ఫన్నీగా సమాధానం చెప్పాడు. ‘అవును. ఈ సారి ఓపెనింగ్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మనకు అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారిలో ఎవరైనా ఓపెనింగ్ చేయగల సమర్థులే.. ఆ ఒత్తిడైతే ఉంది. నా సెంచరీ క్రెడిట్ నీకే ఇస్తాను. నువ్వు ఓపెనింగ్ కు వస్తావనే భయంతోనే నేను సెంచరీ చేయాల్సి వచ్చింది...’ అని నవ్వుతూ సమాధానమిచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఖాతా షేర్ చేసింది. ఇప్పుడు ఇది కాస్తా వైరల్ అవుతున్నది. ఇదిలాఉండగా.. హ్యాట్రిక్ మిస్ అయినందుకు నువ్వేమైనా బాధపడుతున్నావా..? అని చాహల్ ను బట్లర్ అడిగాడు. దానికి చాహల్ లేదని సమాధానమిచ్చాడు.
ముంబైతో మ్యాచులో చాహల్ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి టిమ్ డేవిడ్ ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపిన చాహల్.. రెండో బంతికి డానియల్ సామ్స్ ను ఔట్ చేశాడు. ఈ క్యాచ్ ను జోస్ బట్లర్ అద్బుతంగా అందుకున్నాడు. అయితే మూడో బంతికి మురుగన్ అశ్విన్ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో ఉన్న కరుణ్ నాయర్ నేలపాలు చేశాడు. దీంతో చాహల్ హ్యాట్రిక్ మిస్ అయింది.
ఈసారి తమ జట్టుకు కూర్పు భాగా కుదిరిందని, ఈ సీజన్ లో టోర్నీ కొట్టేందుకు యత్నిస్తున్నామని బట్లర్ తెలిపాడు. ఆన్ ది ఫీల్డ్ లోనే గాక బయట నుంచి కూడా చాలా మంది దిగ్గజ క్రికెటర్లు రాజస్థాన్ విజయాల కోసం పని చేస్తున్నారని చెప్పాడు.
ఇక శనివారం ముంబై ఇండియన్స్ తో ముగిసిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ముంబై... 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 170 పరుగులే చేయగలిగింది. ఫలితంగా రాజస్థాన్.. 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
