T20 Worldcup 2021: అదరగొట్టిన నమీబియా... టీమిండియా ముందు మంచి టార్గెట్...
టీ20 వరల్డ్ కప్ 2021 : నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసిన నమీబియా... అశ్విన్, జడేజాలకు మూడేసి వికెట్లు...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ సూపర్ 12 రౌండ్లో పసికూన నమీబియాతో జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో భారత స్పిన్నర్లు తిప్పేశారు. అటు రవీంద్ర జడేజా, ఇటు రవిచంద్రన్ అశ్విన్ పోటాపోటీగా వికెట్లు తీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేయగలిగింది నమీబియా... ఇది తక్కువ స్కోరుగా కనిపిస్తున్నా, నమీబియా వంటి పెద్దగా అనుభవం లేని జట్టుకి ఇది మంచి స్కోరే.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన నమీబియాకి శుభారంభం అందించారు ఓపెనర్లు. స్టీఫన్ బార్డ్, మైకెల్ వాన్ లింగెన్ కలిసి 4.3 ఓవర్లలోనే 33 పరుగుల భాగస్వామ్యం అందించారు. 15 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన మైకెల్ వాన్ లింగెన్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్లో మహ్మద్ షమీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
ఆ తర్వాత క్రెగ్ విలియమ్స్ 4 బంతులాడి డకౌట్ అయ్యాడు. జడ్డూ బౌలింగ్లో షాట్ ఆడేందుకు క్రెగ్ విలియమ్స్ ముందుగా రాగా, బంతికి అందుకున్న రిషబ్ పంత్ స్టంపౌట్ చేశాడు. 21 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 21 పరుగులు చేసిన స్టీఫన్ బార్డ్ కూడా రవీంద్ర జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..
గ్రెహర్డ్ ఎరాస్మస్ 20 బంతుల్లో ఓ ఫోర్తో 12 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, 5 పరుగులు చేసిన జాన్ నికోల్ లోఫ్టీ ఈటన్ కూడా అశ్విన్ బౌలింగ్లోనే రోహిత్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
జేజే స్మిత్ 9 పరుగులు చేసి జడేజా బౌలింగ్లో రోహిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, జేన్ గ్రీన్ని మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. 25 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసిన డేవిడ్ వీస్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి రోహిత్ శర్మకి క్యాచ్ ిచ్చి అవుట్ అయ్యాడు...
గత మ్యాచ్లో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన జడేజా, నేటి మ్యాచ్లో 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజాకి టీ20ల్లో ఈ రెండు అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. అలాగే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మూడుసార్లు మూడేసి వికెట్లు తీసిన బౌలర్లుగా బాలాజీతో పాటు సమంగా నిలిచారు జడేజా, అశ్విన్...
Read this: అట్టర్ ఫ్లాప్ దిశగా టీ20 వరల్డ్ కప్ టోర్నీ... రేటింగ్స్ను దెబ్బతీసిన టీమిండియా పర్ఫామెన్స్...
టీ20 వరల్డ్ కప్ టోర్నీ కెరీర్లో 25 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఓవరాల్గా అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు. షకీబుల్ హసన్ 41, షాహీద్ ఆఫ్రిదీ 39, సయ్యిద్ అజ్మల్ 35, అజంతా మెండీస్ 35 వికెట్లు తీశారు. అయితే టాప్ 5లో ఉన్న వారిలో బెస్ట్ ఎకానమీ ఉన్న బౌలర్ నిలిచిన అశ్విన్, యావరేజ్లో రెండో స్థానంలో ఉండడం విశేషం.
జస్ప్రిత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా మహ్మద్ షమీ తన నాలుగు ఓవర్లలో వికెట్ తీయలేకపోగా 39 పరుగులు సమర్పించాడు. భారత బౌలర్ల ఎక్స్ట్రాల రూపంలో 17 పరుగులు సమర్పించడం విశేషం.