అట్టర్ ఫ్లాప్ దిశగా టీ20 వరల్డ్ కప్ టోర్నీ... రేటింగ్స్ను దెబ్బతీసిన టీమిండియా పర్ఫామెన్స్...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీ ఫ్యాన్స్ని తీవ్రంగా నిరాశపరిచింది. భారీ స్కోర్లు, ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగే మ్యాచులను చూద్దామని ఆశించిన అభిమానులకు, దాదాపు అన్నీ వన్సైడెడ్ మ్యాచులుగా ముగియడంతో టోర్నీ పరమ చప్పగా సాగుతోంది...
టీ20 వరల్డ్కప్ టోర్నీ సూపర్ 12 రౌండ్ ప్రారంభంలో జరిగిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్కి రికార్డు స్థాయిలో వ్యూయర్షిప్ వచ్చింది. కేవలం హాట్ స్టార్ యాప్లో 1.2 కోట్ల మంది లైవ్ వీక్షించారు. హాట్ స్టార్లో ఇది ఓ రికార్డు...
ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా... అన్ని విభాగాల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యింది. నీరసంగా సాగిన ఈ మ్యాచ్... ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది...
ఈ రెండు మ్యాచుల్లో ఓడడంతో భారత జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు దెబ్బతిన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్ వంటి చిన్న జట్లపై మనవాళ్లు ప్రతాపం చూపించినా... దాన్ని పెద్దగా పట్టించుకున్నవాళ్లు లేరు...
ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ పూర్తి ఓవర్ల పాటు సాగినా స్కాట్లాండ్తో మ్యాచ్ అయితే మొత్తంగా రెండు ఇన్నింగ్స్లు కలిపి 24 ఓవర్ల పాటు మాత్రమే సాగింది. దీంతో ఆ ఎఫెక్ట్ టీఆర్పీపై తీవ్రంగా పడింది...
మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్లో జనాభా, క్రికెట్ ఫ్యాన్స్ సంఖ్య చాలా ఎక్కువ. అందుకే కమర్షియల్ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని భారత జట్టు ఈజీగా ప్లేఆఫ్స్ చేరేందుకు వీలుగా గ్రూప్ 2లో చోటు కల్పించింది ఐసీసీ...
ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్పై గత రికార్డు చూసుకుంటే, ఈజీగా గెలుస్తుంది కాబట్టి న్యూజిలాండ్తో మ్యాచ్లో ఓడినా మిగిలిన మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్స్ చేరడం భారత జట్టుకి పెద్ద కష్టమేమీ కాదని భావించారు నిర్వహాకులు... అయితే వారి అంచనాలు తలకిందులయ్యాయి...
అసలే మ్యాచులు చప్పగా సాగుతుండడం, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ టీమిండియా ప్లేఆఫ్స్కి అర్హత సాధించకపోవడంతో టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయట...
2007 వన్డే వరల్డ్కప్ సమయంలోనూ ఇండియా, పాకిస్తాన్ జట్లు గ్రూప్ స్టేజ్ నుంచి నిష్కమించడంతో ఐసీసీకి భారీ నష్టం వచ్చింది. ఇప్పుడు యూఏఈలో జరుగుతున్న టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలోనూ అదే సీన్ రిపీట్ కానుందని అంచనా...
టీమిండియాతో పాటు భారీ హిట్టర్లు ఉన్న వెస్టిండీస్ జట్టు కూడా గ్రూప్ స్టేజ్కే పరిమితం కావడం టోర్నీపై తీవ్ర ప్రభావం చూపనుంది. నమీబియాతో భారత జట్టు మ్యాచ్ తర్వాత టీ20 వరల్డ్కప్ టోర్నీని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరని కూడా అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...
అదీకాకుండా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ జరిగింది. సెకండ్ ఫేజ్లో ఐపీఎల్ మ్యాచులు క్రికెట్ ఫ్యాన్స్ని అలరించాయి. గత సీజన్తో పోలిస్తే, ఈ సీజన్లో పెద్దగా మజా లేకపోయినా సీఎస్కే, ఆర్సీబీ కారణంగా టీఆర్పీ స్టడీగా సాగింది...
2019 వన్డే వరల్డ్కప్ టోర్నీలో భారత జట్టు సెమీస్ నుంచే నిష్కమించినా ఫైనల్ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఫైనల్ మ్యాచ్ టైగా ముగియడం, సూపర్ ఓవర్ కూడా టై కావడంతో జనాలు ఆసక్తికరంగా ఆ మ్యాచ్ని వీక్షించారు..
ఈసారి అలాంటి డ్రామా జరిగితేనే పడిపోయిన వ్యూయర్షిప్ మళ్లీ పైకి లేచే అవకాశం ఉంది. లేదంటే పొట్టి ప్రపంచకప్ కారణంగా భారీ మొత్తం వెచ్చింది ప్రసార హక్కులు కొనుగోలు చేసిన ఛానెళ్లకి భారీ నష్టం తప్పదని అంటున్నారు విశ్లేషకులు..