T20 World cup: ఆ ముగ్గురిలో ఒకరికి ఉధ్వాసన..? టీ20 వరల్డ్ కప్ లో అయ్యర్ కు చోటు కన్ఫర్మ్ అయినట్టేనా..?
ఐపీఎల్ (ipl 2021) ముగిసిన వెంటనే యూఏఈ వేదికగా మొదలుకానున్న టీ20 ప్రపంచకప్ లో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ (bcci) ఇప్పటికే ప్రకటించింది. అయితే దుబాయ్ లోనే మకాం వేసిన బోర్డు పెద్దలు.. జట్టుకు ఎన్నికైన ఆటగాళ్ల ప్రదర్శన, ఫిట్నెస్ ను చాలా దగ్గరగా పరిశీలిస్తున్నారు.
ఈసారి ఎలాగైనా పొట్టి ప్రపంచకప్ నెగ్గాలని భావిస్తున్న విరాట్ సేన అందుకు పక్కా ప్లాన్ తోనే ముందడుగు వేస్తున్నది. ఇందులో భాగంగానే బీసీసీఐ.. నయా క్రికెట్ స్ట్రాటజిస్టు మహేంద్ర సింగ్ ధోనిని భారత టీ20 జట్టుకు మెంటార్ గా నియమించింది. అయితే అంతా సవ్యంగానే జరుగుతుందని భావిస్తున్న వేళ ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమి సెలక్టర్లను ఒకింత ఆందోళనకు గురి చేస్తున్నది.
కొద్దిరోజుల క్రితం బీసీసీఐ ప్రకటించిన జట్టులో.. ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, హర్ధిక్ పాండ్యాలు ఉన్నారు. అయితే కిషన్, యాదవ్ లు వరుసగా విఫలమవుతుండగా.. పాండ్యా ఫిట్నెస్ పై ఇప్పటికీ అనుమానాలు నెలకొన్నాయి. ఐపీఎల్ సెకండ్ ఫేజ్ తొలి రెండు మ్యాచ్ లకు పాండ్యా దూరంగా ఉన్నాడు. బెంగళూరుతో ఆడినా బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్ లో సైతం పెద్దగా ప్రభావం చూపలేదు. ఇదే ఇప్పుడు బీసీసీఐని ఆందోళనకు గురి చేస్తున్నది.
గతేడాది వెన్నునొప్పితో శస్త్ర చికిత్స చేయించుకున్న పాండ్యా.. ఇటీవల శ్రీలంకతో సిరీస్ ఆడినా అందులో కూడా పెద్దగా రాణించలేదు. బౌలింగ్ కోటా కూడా పూర్తి చేయలేదు. అయినా అతడిని టీ20 జట్టుకు ఎంపికచేయడంపై పలువురు సీనియర్లు బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపించారు. పాండ్యా ఎంపికను సమర్థించుకున్న సెలెక్టర్లు.. ప్రపంచకప్ లో అతడు తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తాడని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తుంటే అతడు వరల్డ్ కప్ ఆడేది సందేహంగానే ఉంది.
ఈ నేపథ్యంలో బ్యాకప్ ప్లేయర్ గా ఎంపికైన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ తుది జట్టులో స్థానం సంపాదించడం ఖాయమే అని భారత క్రికెట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి బోర్డు ప్రతినిధి ఒకరు స్పందిస్తూ... ‘అవును.. ఇది కొద్దిగా ఆందోళన పరిచే అంశమే. మనకు ఇంకా కొన్ని ఐపీఎల్ మ్యాచులున్నాయి. తర్వాత జరిగే మ్యాచులలోనైనా వారు సరిగా ఆడతారో లేదో చూడాల్సి ఉంది. సూర్య, ఇషాన్ ల ఫామ్ పై చింతించాల్సిన పన్లేదు. ఏదేమైనా మాకు బ్యాకప్ ప్లేయర్ గా శ్రేయస్ ఉన్నాడు’ అని అన్నాడు.