సారాంశం

T20 World Cup 2024, Semi-Final : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ఇప్పుడు చివరి రౌండ్‌కు చేరుకుంది. 20 జట్లలో 4 జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్  టాప్4లో నిలిచాయి. అనూహ్యంగా పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా వంటి మాజీ చాంపియన్ జట్లు మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
 

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో ఇంకా చివరి మూడు మ్యాచ్‌లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి.  అయితే, ఐసీసీ తీసుకువ‌చ్చిన కొత్త నిబంధ‌న‌లు, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల పై ప్ర‌భావం చూపే అవ‌కాశ‌ముంది. ఐసీసీ కొత్త రూల్స్ కార‌ణంగా భార‌త్ లాభామా? న‌ష్ట‌మా? ఏ జ‌ట్లపై ఎలాంటి ప్ర‌భావం చూప‌నుంది? టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌లు జూన్ 27న జరగనున్నాయి. తొలి సెమీఫైనల్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు జరుగుతుంది.

ఐసీసీ కొత్త రూల్స్ ఏమిటి?   భార‌త్ పై ఎలాంటి ప్ర‌భావం చూప‌నుంది?  

టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌తో సహా నాకౌట్ మ్యాచ్‌ల కోసం ఐసీసీ కొన్ని షరతులను విధించింది. మొదటి సెమీ-ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది, కానీ తక్కువ సమయం కారణంగా రెండవ సెమీ-ఫైనల్‌కు రిజర్వ్ డే లేదు. అయితే, వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దు కాకుండా, తగినంత రిజర్వ్ సమయం ఉండేలా ఐసీసీ నిబంధనలను రూపొందించింది. దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే మొదటి సెమీ-ఫైనల్ కోసం షెడ్యూల్ చేయబడిన రోజు ఆట ముగిసే సమయానికి అదనపు 60 నిమిషాలు కేటాయించారు. ఆ రోజు కూడా ఫలితం తేలకపోతే రిజర్వ్‌ రోజున మ్యాచ్‌ పూర్తవుతుంది. ఇప్పుడు భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ విషయానికొస్తే, ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేనందున మ్యాచ్ రోజు మొత్తం 250 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు.

10-10 ఓవర్ రూల్ ఏమిటి? 

మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడానికి రెండు జట్లు ఎన్ని ఓవర్లు ఆడాలి అనేది ఆట పరిస్థితులలో మరో మార్పులు కూడా చేశారు.  సూపర్ 8 దశ వరకు, ఫలితం పొందడానికి రెండు జట్లూ కనీసం 5 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది, అయితే సెమీ-ఫైనల్, ఫైనల్ కోసం జట్లు ఒక్కొక్కటి 10 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే?

వాతావరణ సూచన ప్రకారం, ట్రినిడాడ్, గయానాలో నిరంతర వర్షం కురిసే అవకాశం ఉన్నందున, రెండు సెమీ-ఫైనల్‌లను వర్షం ప్రభావితం చేసే అవకాశం ఉంది. అదనపు సమయం కేటాయించినప్పటికీ సెమీ-ఫైనల్స్ వాష్ అవుట్ అయితే, సూపర్ 8 దశలో తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. వర్షం కారణంగా ఫైనల్ కూడా రద్దైతే, ఫైనలిస్టులను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. కాబ‌ట్టి ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ అన్ని మ్యాచ్ ల‌ను గెలిచింది కాబ‌ట్టి ఇంగ్లండ్ తో మ్యాచ్ ర‌ద్దైతే నేరుగా ఫైన‌ల్ చేరుకుంటుంది.