Asianet News TeluguAsianet News Telugu

పోయినసారి ఏడిపించారు! ఈసారి ప్రతీకారం తీర్చుకోండి... ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ప్రోమో...

అక్టోబర్ 23న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌... దాదాపు 90 వేల మంది ప్రేక్షకుల మధ్య దాయాదుల పోరు...

Stars Sports India released new promo for India vs Pakistan match in T20 World cup 2022
Author
First Published Oct 2, 2022, 1:12 PM IST

దాయాదుల మధ్య మ్యాచ్ అంటే అది కేవలం రెండు జట్ల మధ్య పోటీ కాదు... రెండు దేశాల ఎమోషన్స్‌కి సంబంధించిన విషయం. ఎప్పుడూ క్రికెట్ మ్యాచ్ చూడని జనాలు కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే టీవీలకు హత్తుకుపోతారు. ఎంత రేట్ అయినా బ్లాక్‌లో టికెట్ కొనుక్కుని స్టేడియంలో వాలిపోతారు. పాకిస్తాన్‌పై గెలిస్తే ఏదో తెలియని సంతృప్తి...  ఆ తర్వాత వరల్డ్ కప్ వచ్చినా, రాకపోయినా పర్లేదని ఫీల్‌ అవుతారు చాలామంది...

అయితే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ చేతుల్లో టీమిండియాకి 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం ఎదురైంది. అంతకుముందు ఎప్పుడూ ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియాపై గెలవని పాకిస్తాన్, అన్నింటికీ కలిపి ఒకే సారి ఘన విజయంతో బదులు తీర్చుకున్నట్టైంది... జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి స్టార్ పేసర్లను ఎదురొడ్డి నిలిచిన పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్... పాక్‌కి చిరస్మరణీయ విజయాన్ని అందించారు...

152-0 స్కోరు బోర్డును చాలామంది పాక్ క్రికెట్ ఫ్యాన్స్, జెర్సీ వెనకాల వేసుకుని తిరిగారు. ఇప్పుడు ఆ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత జట్టుకి మరో అవకాశం దక్కింది. అక్టోబర్ 23న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు ఏడాది కిందటే అమ్ముడైపోయాయి. రికార్డు స్థాయిలో దాదాపు 90 వేల మంది ప్రేక్షకుల మధ్య భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది...

2022లో ఇప్పటికే రెండు సార్లు తలబడ్డాయి భారత్, పాకిస్తాన్ జట్లు. ఆసియా కప్ 2022 టోర్నీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని ఓడించింది టీమిండియా. అయితే ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవకుండా సూపర్ 4 రౌండ్‌లో పాక్ చేతుల్లో పరాజయాన్ని చవి చూసింది భారత జట్టు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌‌పైకి మళ్లింది...

తాజాగా ఈ మ్యాచ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. ‘నేను శర్మజీ కొడుకు. ఇంది దర్ద్‌నాపూర్. ఇక్కడ ఎవ్వరూ దేనికి భయపడరు, బాధపడరు. మేం టీమిండియా విజయాన్ని గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటాం. బలంతో పండగ చేసుకుంటాం.అయితే ఒక్క సంఘటనతో అంతా మారిపోయింది. ఆ రోజు... అందరూ ఏడ్చేశారు. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈసారి గెలిచి పోయిన ఏడాది జరిగిన ఓటమిని తుడిచేయండి. ఇంకా ఎదురుచూపులకు ముగింపు పలకండి...’ అంటూ ఓ కుర్రాడు చెప్పే ప్రోమోను విడుదల చేసింది...

ఇంతకుముందు ఐసీసీ వరల్డ్‌ కప్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ‘మోకా... మోకా...’ అంటూ పాక్ అభిమాని, భారత్‌పై మ్యాచ్ ఎప్పుడు గెలిస్తే అప్పుడు టపాకాయలు పేల్చాలని తిరుగుతూ ఉండే ప్రోమో... వాడుతూ వచ్చింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. అయితే గత ఏడాది టీ20 వరల్డ్ కప్ 2021లో ఆ టపాకాయలను కాల్చేయడంతో ఇప్పుడు కొత్త ప్రోమోను తీసుకొచ్చారు...


 

Follow Us:
Download App:
  • android
  • ios