భారత్తో సిరీస్లకు లంక జట్టు ప్రకటన.. వివాదాస్పద ఆటగాడి రీఎంట్రీ..
INDvsSL: త్వరలో భారత పర్యటనకు రానున్న శ్రీలంక టీమిండియాతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ రెండు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది.
వచ్చే నెలలో టీమిండియాతో టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు శ్రీలంక క్రికెట్ జట్టు ఇండియాకు రానున్నది. రెండు ఫార్మాట్లలో జరుగబోయే సిరీస్ లకు గాను ఆ దేశ క్రికెట్ బోర్డు బుధవారం జట్లను ప్రకటించింది. ఇరు ఫార్మాట్లకూ దసున్ శనక సారథిగా వ్యవహరించనున్నాడు. టీ20లలో అదరగొడుతున్న యువ బౌలర్ వనిందు హసరంగను ఈ ఫార్మాట్ లో వైస్ కెప్టెన్ గా నియమించిన లంక బోర్డు.. ఇటీవలే ఏడాది పాటు నిషేధం విధించిన ఆల్ రౌండర్ చమీక కరుణరత్నేను తిరిగి జట్టులోకి పిలవడం గమనార్హం.వన్డేలకు కుశాల్ మెండిస్ ఉపసారథిగా వ్యవహరించనున్నాడు.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన కరుణరత్నే అక్కడ ఓ పబ్ లో పలువురు వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించాడని లంక బోర్డు విచారణలో తేలింది. దీంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా అతడిపై నిషేధం విధించింది.
కానీ రెండు నెలలు కూడా గడవకముందే అతడిని జట్టులోకి తీసుకుంది. మరి చమీకపై నిషేధం ఎత్తివేశారా..? లేదా..? అన్నదానిపై కూడా లంక బోర్డు ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు. రెండు ఫార్మాట్లలో అతడికి చోటివ్వడం గమనార్హం.
ఇక గతేడాది ఆస్ట్రేలియాతో రెండు టెస్టులు, వన్డేలలో రాణించిన బ్యాటర్ అవిష్క ఫెర్నాండో తిరిగి జట్టుతో చేరాడు. గాయం కారణంగా ఇన్నాళ్లు జట్టుకు దూరమైన అతడు.. మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్ లో అతడు టాప్ స్కోరర్ గా నిలిచాడు. అవిష్కతో పాటు సదీర సమరవిక్రమకు కూడా చోటు దక్కింది. ఈ ఇద్దరితో పాటు లంక ప్రీమియర్ లీగ్ లో రాణించిన కొత్త కుర్రాడు, యువ పేసర్ నువానిదు ఫెర్నాండో కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
భారత్ తో వన్డే సిరీస్ కు లంక జట్టు : దసున్ శకన (కెప్టెన్), కుశాల్ మెండిస్, పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, వనిందు హసరంగ, అషేన్ బండార, మహీష్ తీక్షణ, జెఫ్రీ వండర్సే, చమీక కరుణరత్నె, దిల్షాన్ మధుశనక, కసున్ రజిత, నువానిదు ఫెర్నాండో, దునిత్ వెల్లలగె, ప్రమోద్ మధుషాన్, లాహిరు కుమార
టీ20లకు : దసున్ శనక (కెప్టెన్), వనిందు హసరంగ, పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్, భానుక రాజపక్స, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, అషేన్ బండార, మహీశ్ తీక్షణ, చమీక కరుణరత్నె, దిల్షాన్ మధుశనక, కసున్ రజిత, దునిత్ వెల్లలగె, ప్రమోద్ మధుషాన్, లాహిరు కుమార, నువాన్ తుషారా