దేశానికి దూకుడైన కెప్టెన్ను అందించిన ద్రోణాచార్యుడు: గంగూలీ గురువు కన్నుమూత
దాదాకు క్రికెట్లో ఓనమాలు నేర్పించి, భారతదేశానికి అందించిన సౌరవ్ చిన్ననాటి కోచ్ అశోక్ ముస్తఫీ కన్నూముశారు
మూసలో సాగిపోతున్న భారత క్రికెట్ జట్టుకు దూకుడును నేర్పించి, బలమైన జట్టుగా తయారు చేశాడు సౌరవ్ గంగూలీ. ఆయన వేసిన పునాదులపై ధోనీ, విరాట్ కోహ్లీలు విజయాలు సాధిస్తూ టీమిండియాకు ఎదురులేకుండా చేశారు.
అలాంటి దాదాకు క్రికెట్లో ఓనమాలు నేర్పించి, భారతదేశానికి అందించిన సౌరవ్ చిన్ననాటి కోచ్ అశోక్ ముస్తఫీ కన్నూముశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అశోక్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఆయన తన కుమార్తెతో కలిసి లండన్లో వుండేవారు. అయితే హృద్రోగ సంబంధిత వ్యాధి కారణంగా ఏప్రిల్ నుంచి అశోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్కు గురికావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
బెంగాల్కు క్రికెట్ పాఠాలు నేర్పే దుఖీరామ్ క్రికెట్ కోచింగ్ సెంటర్లో అశోక్ ముస్తాఫీ ప్రముఖ కోచ్గా ఉండేవారు. ఆయన వద్ద శిక్షణ తీసుకున్న 12 మంది బెంగాల్ క్రికెటర్లుగా ఎదిగారు. సౌరవ్ గంగూలీ చిన్నతనంలో తొలిసారిగా ముస్తాఫీ వద్దే క్రికెట్లో ఓనమాలు దిద్దాడు.
దాదా స్నేహితుడు సంజయ్ దాస్ కూడా ఆయన వద్ద క్రికెట్ శిక్షణ ప్రారంభించాడు. అయితే తమ గురువు ఆరోగ్యం క్షీణించిందని తెలుసుకున్న సౌరవ్ గంగూలీ, సంజయ్ వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు.