Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ స్టార్  విరాట్ కోహ్లీ  గురువారం రాత్రి  సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో  సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీ సెంచరీ తర్వాత  ప్రముఖ జర్నలిస్టు రజత్ శర్మ చేసిన ట్వీట్ వైరల్ అయింది. 

నాలుగేండ్ల తర్వాత ఐపీఎల్ లో సెంచరీ చేసిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రముఖ జర్నలిస్టు, ‘ఇండియా టీవీ’ ఎడిటర్ ఇన్ చీఫ్ రజత్ శర్మ ప్రశంసలు కురిపించారు. కోహ్లీని పొగుడుతూ ఆయన మరోసారి గంభీర్ ను టార్గెట్ చేయడం గమనార్హం. విరాట్ సెంచరీ చూడముచ్చటగా ఉందన్న రజత్ శర్మ.. ఈ సెంచరీతో ఎవరో ఎక్కడో నిరాశగా ఉంటారని ట్వీట్ లో పేర్కొన్నారు. 

కోహ్లీ సెంచరీ తర్వాత రజత్ శర్మ తన ట్విటర్ వేదికగా.. ‘విరాట్ చేసిన అధ్బుతమైన శతకం చూడముచ్చటగా ఉంది. అఫ్‌కోర్స్.. ఎవరో ఎక్కడో చాలా నిరాశగా ఉండి ఉంటారు’అని ట్వీట్ చేశారు.

రజత్ శర్మ ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే నెట్టింట ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇండియా టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ చెప్పిన ‘ఎవరో.. ఎక్కడో’ లక్నో మెంటార్ గంభీరేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు ఈ ట్వీట్ కింద గంభీర్ ఫోటోను షేర్ చేస్తూ.. ‘మీరు చెప్పిన ఆ నిరాశవాది ఈయనే కదా. మాకు తెలుసు..’అని కామెంట్స్ పెడుతున్నారు. 

Scroll to load tweet…

కాగా ఐపీఎల్ -16 లో భాగంగా మే 1న లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముగిసిన మ్యాచ్ లో తలెత్తిన కోహ్లీ - గంభీర్ వివాదంపై రజత్ శర్మ గతంలో స్పందిస్తూ.. కోహ్లీకి జనాల్లో ఉన్న అభిమానానికి అతడి విజయాలపై గంభీర్ కు అసూయగా ఉందని, అది మొన్న జరిగిన మ్యాచ్ లో మళ్లీ నిరూపితమైందని అన్నారు. ఓ మాజీ క్రికెటర్ గా ఉండి గంభీర్ ఇలా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడ్డారు. అంతేగాక ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు.

రజత్ వ్యాఖ్యలకు గంభీర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ‘ఢిల్లీ క్రికెట్ నుంచి ఒత్తిడి కారణాన్ని చూపిస్తూ తప్పుకున్న వ్యక్తి.. పెయిడ్ పీఆర్, పెయిడ్ వార్తలను వ్యాప్తి చేస్తున్నాడు. ఈ కలియుగంలో పారిపోయినవాళ్లే కోర్టులను నడిపిస్తున్నారు’ అని పేర్కొన్నాడు.

Scroll to load tweet…

రజత్ శర్మ గతంలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు అధ్యక్షుడిగా నియమితుడై నెల తిరక్కముందే ఈ బాధ్యతలు తాను మోయలేనని ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇక కలియుగంలో పారిపోయినవాళ్లే కోర్టులు నడిపిస్తారనేదానికి.. రజత్ శర్మ ఇండియా టీవీలో ‘ఆప్ కి అదాలత్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను బోనులో కూర్చోబెట్టి ఆయన ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ షో దేశవ్యాప్తంగా ఫేమస్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారే..