Shreyas Iyer: ఐపీఎల్ ప్రారంభానికి ముందే కోల్కతా నైట్ రైడర్స్ కు భారీ షాక్ తప్పేట్టు లేదు. ఆ జట్టు సారథి శ్రేయాస్ అయ్యర్ రాబోయే సీజన్ ఆడటం అనుమానంగానే ఉంది.
మరో రెండు వారాల్లో మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు భారీ షాక్ తప్పేట్టు లేదు. బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. శ్రేయాస్ నడవడానికి కూడా ఇబ్బందిపడుతున్నాడని తెలుస్తున్నది. వెన్నునొప్పితో బాధపడుతున్న అయ్యర్.. అహ్మదాబాద్ టెస్టులో భారత ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ కు కూడా రాలేదు.
టెస్టు జరుగుతున్న క్రమంలోనే అతడిని వైద్య చికిత్సల నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ సిరీస్ కు ముందు వెన్నునొప్పితో దూరమైన అయ్యర్.. ఆస్ట్రేలియాతో సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో కూడా ఆడలేదు.
ఇక అహ్మదాబాద్ టెస్టులో నాలుగో రోజే టెస్టు సందర్భంగా అయ్యర్ ను వైద్య పరీక్షల నిమిత్తం పంపించగా ప్రస్తుతం అతడు నడవలేని స్థితిలో ఉన్నాడని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక కథనంలో వెల్లడించింది. ఇప్పటికే వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న అయ్యర్.. ఐపీఎల్ లో కూడా ఆడేది అనుమానంగానే ఉంది. ప్రస్తుతం బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అయ్యర్.. వెన్ను గాయానికి శస్త్రచికిత్స అవసరమని తేల్చినట్టు సమాచారం. ఇదే నిజమైతే అతడు.. మూడు నుంచి నాలుగు నెలల పాటు గ్రౌండ్ లోకి అడుగుపెట్టడం కష్టమేనని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో అయ్యర్ రెండు, మూడు టెస్టు మ్యాచ్ లలో ఆడాడు. కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడతంలో విఫలమయ్యాడు. కాగా అయ్యర్ కు శస్త్రచికిత్స అవసరమని తేలితే మాత్రం అది ఐపీఎల్ లో కేకేఆర్ కు భారీ షాకే. గత సీజన్ కు ముందు జరిగిన వేలం ప్రక్రియలో కేకేఆర్ అయ్యర్ ను రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. అతడిని సారథిగా కూడా నియమించింది. ఇక అయ్యర్ కు సర్జరీ అవసరమైనా లేక కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలనుకున్నా అది కేకేఆర్ కు నష్టమే. రెగ్యులర్ సారథి లేకుండానే ఆ జట్టు 2023 సీజన్ లో బరిలోకి దిగాల్సి ఉంటుంది.
ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ లు గాయాల కారణంగా ఐదారు నెలల పాటు భారత జట్టుకు దూరంగా ఉండనున్న నేపథ్యంలో తాజాగా అయ్యర్ కు కూడా సర్జరీ అవసరమైతే మరో కీలక బ్యాటర్ మిస్ కానున్నాడు.
