ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ - 2023లో సంచలనం నమోదైంది. భారత జట్టు హాంకాంగ్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. 

ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హాంకాంగ్ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ - 2023లో సంచలనం నమోదైంది. భారత యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ధాటికి హాంకాంగ్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఈ మ్యాచ్ లో మూడు ఓవర్లు వేసిన శ్రేయాంక.. ఓ మెయిడిన్ చేయడమే గాక రెండు పరుగులే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి హాంకాంగ్ వెన్ను విరిచింది. ఆమె ఇచ్చిన రెండు పరుగులలో ఒకటి వైడ్ రూపంలో వచ్చిందే కావడం గమనార్హం. 

మిషన్ రోడ్ గ్రౌండ్, మాంగ్ కాంగ్ (హాంకాంగ్) వేదికగా నేడు జరిగిన మ్యాచ్ లో హాంకాంగ్ టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చింది. ఆ జట్టులో ఓపెనర్ మరికో హిల్.. 14 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. 

మరికో హిల్ తర్వాత మరినా ఐదు పరుగులు చేసింది. శ్రేయాంక తో పాటు భారత బౌలర్లలో మన్నత్ కశ్యప్, పర్షవి చోప్రాల ధాటికి హాంకాంగ్ లో నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యాడరు. 10 మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత స్పిన్నర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో హాంకాంగ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 

స్వల్ప లక్ష్యాన్ని ఇండియా ఎ ఉమెన్స్ టీమ్.. 5.2 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ శ్వేతా సెహ్రావత్ (2) నిరాశపరిచినా వికెట్ కీపర్ ఉమా చెత్రి (16 నాటౌట్), తెలంగాణ అమ్మాయి గొంగడి సునీత (19 నాటౌట్) లు మరో వికెట్ పడకుండా భారత విజయాన్ని పూర్తి చేశారు.

Scroll to load tweet…

యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, పాకిస్తాన్, నేపాల్, హాంకాంగ్, భారత్ లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత జట్టు తమ తర్వాతి మ్యాచ్ ను ఈనెల 15న నేపాల్ తో ఆడనుంది. ఈనెల 17న భారత్.. పాకిస్తాన్ తో తలపడనుంది.