IPL 2022: ఆ నాలుగు పేర్లు నేను చెప్పనా? సీఎస్కేను ఆట పట్టించిన జడ్డూ.. గమ్మునుండవోయ్ అంటూ రిప్లై ఇచ్చిన చెన్నై
Ravindra Jadeja: ఐపీఎల్ మెగా వేలానికి టైం దగ్గర పడుతున్నది. అంతకంటే ముందే ఐపీఎల్ జట్లు ఆయా జట్లు నిలుపుకోబోయే ఆటగాళ్ల జాబితాను అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ఓ ట్వీట్ కు జడ్డూ ఇచ్చిన రిప్లై ఆసక్తికరంగా ఉంది.
నవంబర్ 30వ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ క్రికెట్ అభిమానులతో పాటు ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లలోనూ ఆసక్తి రోజురోజుకూ పెరుగుతున్నది. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆయా జట్లు అట్టిపెట్టుకునే నలుగురు ఆటగాళ్ల పేర్ల జాబితాను ఈ నెలాఖరు వరకు బీసీసీఐకి అందజేయాల్సి ఉంది. ఇక ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టైన చెన్నై సూపర్ కింగ్స్ నిలుపుకునేది ఎవరా..? అనేదానిపై కూడా తమిళ తంబీలు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం ఆ నలుగురు ఎవరని తెలుసుకోవాలనుందా..? అని ట్వీట్ చేసింది.
ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆ జట్టు.. ‘రిటెన్షన్ టెన్షన్ స్టార్ట్ అయింది. మీ మైండ్ లో మీకు నచ్చిన నలుగురు ఆటగాల్ల పేర్లను ఇక్కడ చెప్పండి..?’ అని ట్వీట్ చేసింది. దీనికి రవీంద్ర జడేజా రిప్లై ఇచ్చాడు.
సీఎస్కే ట్వీట్ కు జడేజా రిప్లై ఇస్తూ.. ‘నేను చెప్పనా...? ’ అంటూ కామెంట్ చేశాడు. ఇప్పుడు ఈ సీఎస్కే ట్వీట్, జడ్డూ రిప్లై చెన్నై అభిమానులను అలరిస్తున్నది. కాగా.. జడ్డూకు సీఎస్కే కూడా ఎపిక్ రిప్లై ఇచ్చింది. ‘ఇప్పుడే కాదు..’ అని పేర్కొన్నది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈసారి చెన్నై సూపర్ కింగ్స్.. ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని తో పాటు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజాలను రిటైన్ చేసుకోనున్నది. అయితే నాలుగో ప్లేయర్ ఎవరనే విషయంపై సందిగ్దత నెలకొన్నది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు డూప్లెసిస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు సామ్ కరన్, మోయిన్ అలీల మధ్య పోటీ నెలకొంది. ఇక చెన్నైకి చాలా కాలంగా ఆడుతున్న డ్వేన్ బ్రావో ఈసారి సీఎస్కే తరఫున ఆడుతాడా..? లేదా..? అన్నది అనుమానమే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇటీవలే వీడ్కోలు పలికిన బ్రావో.. ఐపీఎల్ లో కొనసాగుతానని తెలిపినా.. అతడిని రిటైన్ చేసుకోవడానికి చెన్నై ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది.
చెన్నైతో పాటు ఇతర జట్లు కూడా ఏ ఏ ఆటగాడిని నిలుపుకోబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతున్నది. ఇప్పటివరకు వస్తున్న వార్తల మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ (రిషభ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, ఆన్రిచ్ నార్త్జ్), ముంబై ఇండియన్స్ (రోహిత్ శర్మ. జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్), కోల్కతా (సునీల్ నరైన్, అండ్రూ రసెల్, వెంకటేశ్ అయ్యర్), రాజస్థాన్ రాయల్స్ (సంజూ శాంసన్), సన్ రైజర్స్ హైదరాబాద్ (కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ తో చర్చలు సాగుతున్నాయి) లు ఆయా ఆటగాళ్లతో చర్చలు సాగిస్తున్నాయి. మరి వీళ్లలో ఆఖరు వరకు ఉండేదెవరో, ఊడేదెవరో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.