ICC ODI WC 2023: వచ్చే వన్డే వరల్డ్ కప్ లో భాగంగా భారత్ - పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నది.
ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఇండియా వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ పాల్గొంటుందా..? లేదా..? అన్న సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆసియా కప్ ను హైబ్రిడ్ మోడల్ లో అంగీకరిస్తే వన్డే వరల్డ్ కప్ లో ఆడతామని చెప్పి మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త రాగం అందుకుంది. వన్డే వరల్డ్ కప్ లో తాము ఆడేది లేనిది నిర్ణయించాల్సింది తమ ప్రభుత్వమని తాజాగా పీసీబీ చీఫ్ నజమ్ సేథీ చెప్పడం కొత్త కన్ఫ్యూజన్ కు దారితీసింది. అంతేగాక నజమ్ సేథీ.. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అహ్మదాబాద్ లో కాకుండా మరోచోట ఆడించాలని మరోసారి కోరాడు.
తాజాగా నజమ్ సేథీ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. అహ్మదాబాద్ లో మ్యాచ్ అంటే ఎందుకు భయపడుతుందని..? సూటిగా ప్రశ్నించాడు. షెడ్యూల్ ప్రకారం అక్కడికి వెళ్లి ఆడి గెలిచి రావాలని సూచించాడు.
అఫ్రిది మాట్లాడుతూ.. ‘మీరు అహ్మదాబాద్ లో ఆడేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారు..? అదేమైనా నిప్పులు కురిపించేదా..? లేక దయ్యమా..? ఒకవేళ ఇదే మీ సమస్య అయితే ఆ సవాళ్లను స్వీకరించండి. షెడ్యూల్ ప్రకారం అక్కడికే వెళ్లి.. వేలాది భారతీయ అభిమానుల ముందు మ్యాచ్ గెలిచి చూపించండి. అది కదా అసలు మజా.. పాకిస్తాన్ గెలవడమే మనకు ముఖ్యం. వాళ్ల(ఇండియా)కు అక్కడ మ్యాచ్ లు నిర్వహించడం కంఫర్టబుల్ అంటే అక్కడే ఆడండి. వాళ్లు కోరుకున్న పిచ్ పై ఆడి మ్యాచ్ గెలవండి. అది అసలైన విజయం...’అని ఓ స్థానిక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
కాగా ఇంకా వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల కాలేదు. దీనిపై ఐసీసీ తుది కసరత్తులు చేస్తున్నది. అహ్మదాబాద్ లో తాము ఆడబోమని పీసీబీ కొత్త కొర్రీలు పెడుతుండటంతో పాటు తాము కొన్ని వేదికల్లో మాత్రమే మ్యాచ్ లు ఆడతామని డిమాండ్ చేస్తుండటంతో వరల్డ్ కప్ షెడ్యూల్ ఆలస్యమవుతోంది. ఇది క్లీయర్ అయితే వరల్డ్ కప్ షెడ్యూల్ అధికారికంగా విడుదలయ్యే అవకాశముంది.
రెండ్రోజుల క్రితం నజమ్ సేథీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘బీసీసీఐ పరిస్థితి మాకు అర్థమైంది. వాళ్లు మా దేశంలో ఆడాలంటే వాళ్ల ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది కుదరదని తేలింది. మా పరిస్థితి కూడా ఇప్పుడు భారత్ మాదిరిగానే ఉంది. వచ్చే వన్డే వరల్డ్ కప్ లో భారత్ కు వెళ్లడానికి మా ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఐసీసీకి కూడా మేం ఇదే వివరించాం. మేం ముందుగా కోరిన వేదికల్లో అహ్మదాబాద్ లేదు. కానీ భారత్ మాత్రం మాతో మ్యాచ్ ను అక్కడే నిర్వహించాలని కోరుతోంది. దీనిపై కూడా మేం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అహ్మదాబాద్ లో ఆడాలా..? వద్దా..? అనేదానికంటే మేం అసలు వన్డే వరల్డ్ కప్ కు వెళ్లాలా..? వద్దా..? అన్నదానిపై మాకు ప్రభుత్వం నుంచి క్లీయరెన్స్ రావాలి..’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
