Virat Kohli - Sarfaraz Ahmed: తన పక్కనే ఉన్న అప్పటి టీమిండియా  కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లీష్ లో ఇరగదీస్తుంటే తాను మాత్రం   ఏమీ అర్థం కాక బిక్కమొఖం వేసుకుని  కూర్చోవడం గురించి  పాక్ మాజీ సారథి స్పందించాడు.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి, వికెట్ కీపర్ సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డ్ లో తన హావబావాలతో గతంలో చాలాసార్లు వైరల్ అయ్యాడు. ట్రోలర్స్ కు సరుకుగా మారిన సర్ఫరాజ్.. తాజాగా గతంలో ఇంగ్లీష్ రాక విలేకరుల సమావేశంలో తంటాలు పడ్డ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. తన పక్కనే ఉన్న అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లీష్ లో ఇరగదీస్తుంటే తాను మాత్రం ఏమీ అర్థం కాక బిక్కమొఖం వేసుకుని కూర్చోవడం గురించి తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కోహ్లీ గడగడా మాట్లాడుతుంటే.. ‘అన్నా ఇది ఎప్పుడు అయిపోద్ది’అని చెప్పిన సంగతి గుర్తు చేసుకున్నాడు. 

అసలేం జరిగిందంటే.. 2019 వన్డే వరల్డ్ కప్ (ఇంగ్లాండ్) సందర్భంగా టోర్నీ ప్రారంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశానికి నాటి సారథులుగా ఉన్న మిగతా జట్లతో పాటు కోహ్లీ, సర్ఫరాజ్ అహ్మద్ లూ వచ్చారు. అప్పుడు విలేకరులు ప్రశ్నల వర్షాన్ని సంధించారు.

పాత్రికేయులు అడిగిన ఓ ప్రశ్నకు కోహ్లీ సమాధానం చెబుతూ.. ‘ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే తీవ్ర ఒత్తిడి మధ్య జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మేం గతంలో చాలాసార్లు చెప్పాం. ఇప్పుడూ చెబుతున్నాం. స్టేడియంలోకి అడుగుపెట్టేదాకా మేం కూడా కాస్తో కూస్తో ఒత్తిడికి లోనవుతాం. కానీ ఒక్కసారి గ్రౌండ్ లోకి అడుగుపెట్టాక మేం ప్రొఫెషనల్స్ అయిపోతాం. ఒక బౌలర్ తన స్కిల్స్ అంతటినీ ఉపయోగించి బ్యాటర్ ను ఎలా ఔట్ చేయాలని చూస్తాడు. బ్యాటర్ కూడా తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడేందుకు యత్నిస్తాడు. మాకు ఇది మిగిలిన మ్యాచ్ ల మాదిరిగానే మరొక గేమ్. అంతే. ఎండ్ ఆఫ్ ది డే ఇరు జట్ల ఆటగాళ్లు ఫీల్ అయ్యేది ఒకటే. మిగిలిన గేమ్ ల మాదిరిగానే ఇది కూడా ఒక గేమ్..’అని ఇంగ్లీష్ లో దంచి కొట్టాడు.

Scroll to load tweet…

ఇక విలేకరులు ఇదే ప్రశ్నకు సమాధానం చెప్పాలని సర్ఫరాజ్ వైపుగా చూశారు. అప్పుడు అతడికి ఏం చెప్పాలో తోచక కాసేపు అటూ ఇటూ చూసి సింపుల్ గా.. ‘నా ఆన్సర్ కూడా సేమ్ కోహ్లీ చెప్పిందే. నేను చెప్పేదాంట్లో కొత్తదేమీ లేదు..’అని అన్నాడు. ఆ తర్వాత విలేకరులు మరో ప్రశ్న అడగగా దానికి సర్ఫరాజ్.. ‘కోహ్లీ ఈ ప్రశ్నకు ముందు నువ్వే ఎందుకు సమాధానం చెప్పకూడదు..?’ అని అడిగా. అప్పుడు కోహ్లీ.. మళ్లీ మళ్లీ గళగళా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అయితే కొద్దిసేపటికి సర్ఫరాజ్ మళ్లీ కోహ్లీ చెప్పేది ఏమీ అర్థం కాక ‘భయ్యా ఇది ఎప్పుడు అయిపోద్ది..’అని చెప్పాడట. ఈ విషయాన్ని సర్ఫరాజ్ తాజాగా ఓ స్థానిక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ సమయంలో సర్ఫరాజ్ ఇచ్చిన వన్ లైన్ ఆన్సర్ (నా ఆన్సర్ కూడా సేమ్ కోహ్లీ చెప్పిందే) చాలాకాలం పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది.

కాగా 2019 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా భారత్ - పాక్ మ్యాచ్ లో టీమిండియా 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. కోహ్లీ, కెఎల్ రాహుల్ లు హాఫ్ సెంచరీలు చేశారు.