IPL 2022: పేరు మార్చి మళ్లీ కొత్తపేరు పెట్టమంటున్న ఐపీఎల్ నయా టీమ్.. ఆ పనిని వాళ్లకే వదిలేసిన లక్నో యాజమాన్యం
IPL 2022: వచ్చే ఐపీఎల్ లో గ్రాండ్ ఎంట్రీ కోసం చూస్తున్న లక్నో ఫ్రాంచైజీ ఆ మేరకు సర్వసన్నద్ధమవుతున్నది. భారీగా ఖర్చు పెట్టి కోచ్, కెప్టెన్ లను దక్కించుకున్న ఆ జట్టు.. తాజాగా పేరు కోసం కూడా వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది.
ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో యాజమాన్యం 2022 సీజన్ కోసం సర్వసన్నద్దమవుతున్నది. ఇప్పటికే కోచ్ ను, మెంటార్ ను ప్రకటించిన సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని యాజమాన్యం.. కెప్టెన్, ఇతర ఆటగాళ్లను కూడా దాదాపుగా ఖాయం చేసినా ఇంకా వాళ్ల పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలో జరుగనున్న ఐపీఎల్ మెగావేలంలో పలువురు కీలక ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఆ జట్టు ప్రణాళికలు రచిస్తున్నది. కోచ్, మెంటార్ తో పాటు ఇతర సహాయక సిబ్బంది ప్రస్తుతం ఆ పనుల్లోనే ఉన్నారు.
ఇదిలాఉండగా.. ఈ ఫ్రాంచైజీ ట్విట్టర్ లో తన పాత పేరును మార్చి నయా నేమ్ తో ఎంట్రీ ఇచ్చింది. గతంలో ఇదే సంజీవ్ గొయెంకా ఐపీఎల్ లో పూణె సూపర్ జెయింంట్స్ పేరుతో ఓ జట్టును కొనుగోలు చేసి తర్వాత దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్ లో ఇప్పుడు ఆ పేరును మార్చారు. దానిని ‘లక్నో ఐపీఎల్ టీమ్’గా మార్చారు.
అంతేగాక ఇప్పుడు లక్నో జట్టుకు పేరు పెట్టే పనిని కూడా నెటిజన్లకే వదిలేసింది యాజమాన్యం. దీని ద్వారా ఇప్పట్నుంచే ఉత్తరప్రదేశ్ ప్రజల్లో తమను తాము పరిచయం చేసుకునేందుకు భారీ ప్లాన్ వేసింది. లక్నో ఐపీఎల్ టీమ్ పేజీలోనే.. ‘ఈ జట్టుకు పేరు పెట్టే బాధ్యత ఇప్పుడు మీదే.. పేరు పెట్టండి , పేరు సంపాదించండి..’ అని ఓ ఆన్లైన్ క్యాంపైన్ ను స్టార్ట్ చేసింది. ఈ మేరకు లక్నో టీమ్ ప్రొఫైల్ పిక్ నే ఇలా మార్చేసింది.
లక్నోలో ఎంతో ప్రాముఖ్యత పొందిన రూమీ దర్వాజాను ఫోటోలో పెట్టడంతోనే ఈ ఫ్రాంచైజీ.. అక్కడి ప్రజలకు దగ్గరయ్యేలా అడుగులు వేస్తున్నదని అర్థమవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ జట్టుకు పేరు పెట్టే యూపీ నెటిజన్లకు తర్వాత ఘనంగా సత్కరించడమే గాక వారికి నగదు బహుమానం కూడా అందజేయనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలాఉండగా ఐపీఎల్ మెగా వేలానికి ముందే ప్రతి జట్టు పాత ఫ్రాంచైజీలలోని ముగ్గురు ఆటగాళ్లను దక్కించుకునే అవకాశమున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాలుగు సీజన్ల పాటు పంజాబ్ సూపర్ కింగ్స్ కు నాయకుడిగా వ్యవహరించిన కెఎల్ రాహుల్ ను జట్టు సారథిగా ఎంపిక చేసుకునే అవకాశముంది. రాహుల్ తో పాటు సుదీర్ఘకాలంపాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడిన అబ్దుల్ రషీద్ కూడా లక్నోకే ఆడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాహుల్ పట్టుబట్టడంతోనే పంజాబ్ కు కోచ్ గా వ్యవహరించిన ఆండీ ఫ్లవర్ ను కూడా లక్నో యాజమాన్యం కొత్త ఫ్రాంచైజీకి హెడ్ కోచ్ గా నియమించింది.