IPL2021: ఆర్సీబీ ఆటగాడు క్రిస్టియన్ భార్యను టార్గెట్ చేసిన ఫ్యాన్స్.. చెత్త వాగుడు ఆపమన్న మ్యాక్స్వెల్..
IPL2021: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించడాన్ని ఆ జట్టు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్సీబీ ఆటగాళ్లు, వారి భార్యలు టార్గెట్ గా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ఆ జట్టు ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ఘాటుగా స్పందించాడు.
ఐపీఎల్ లో మరోసారి Royal Challengers Bangloreకు భంగపాటు తప్పలేదు. తొలి IPL ట్రోఫీ కోసం ఆ జట్టు మరో సీజన్ దాకా వేచి చూడాల్సిందే. సోమవారం Kolkata knight Ridersతో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో ఓటమిని జర్ణించుకోలేని ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆ జట్టు ఆటగాళ్లపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఆటగాళ్లతో పాటు వారి భార్యలను సామాజిక మాధ్యమ ఖాతాల్లో బూతులు తిడుతున్నారు.
మ్యాచ్ అనంతరం RCB బౌలర్ డేనియల్ క్రిస్టియన్ తో పాటు అతడి భార్యను టార్గెట్ చేసుకున్న పలువురు అభిమానులు.. ఆమెకు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభ్యంతరకరమైన మెసేజ్ లు చేశారు. ఈ విషయాన్ని Daniel Christian తన సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపాడు.
అయితే వీటిపై మరో ఆస్ట్రేలియన్ Glenn Maxwell స్పందించాడు. ట్రోలర్స్ కు, అభ్యంతరకరమైన మెసేజ్ లు పెడుతున్నవారి గూబ గుయ్యిమనేలా సమాధానమిచ్చాడు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా మ్యాక్స్వెల్ స్పందిస్తూ...‘కొంతమంది సోషల్ మీడియా వేదికగా చెత్త వాగుడు వాగుతున్నారు. ఇది నిజంగా హేయం. మేమూ మనుషులమే. ప్రతిరోజు మా అత్యుత్తమ ఆట కనబరిచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం. అసభ్యంగా ప్రవర్తించే బదులు కొంచెం డీసెంట్ గా ఉండేందుకు ట్రై చేయండి’ అంటూ రాసుకొచ్చాడు.
మరో పోస్టులో.. ‘ఆర్సీబీకి ఇదొక గొప్ప సీజన్. మేము అద్భుతంగా ఆడాం. కానీ దురదృష్టవశాత్తుల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. ప్రతి సమయంలో మాకు అండగా నిలిచిన నిజమైన అభిమానులకు ధన్యవాదాలు. అయితే, దురదృష్టవశాత్తు పలువురు భయంకరమైన మనస్తత్వాలు గల మనుషులు సోషల్ మీడియాలతో చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇది మాత్రం సబబు కాదు. వారిలా ఉండకండి..!’ అంటూ ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
నిన్నటి మ్యాచ్ లో క్రిస్టియన్.. బ్యాటింగ్ లో 8 బంతుల్లో 9 పరుగులు చేసి రనౌట్ కాగా.. బౌలింగ్ లో 1.4 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చాడు. అదీగాక.. అతడు వేసిన 12 ఓవర్లో కేకేఆర్ ఆటగాళ్లు 3 సిక్సర్లు బాదారు. అప్పటిదాకా కోల్కతాను కట్టడి చేసిన బెంగళూరు బౌలర్లు.. ఆ ఓవర్ తో ఢీలా పడ్డారు. ఆ ఓవర్ లో 22 పరుగులొచ్చాయి.
ఈ ఓవరే తమ విజయావకాశాలను దెబ్బతీసిందని ఆర్సీబీ సారథి Virat Kohliకూడా చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ..‘ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్ ఆడిన 12 వ ఓవరే మాకు విజయాన్ని దూరం చేసింది. మేం చివరివరకు బంతితో పోరాడాం. బ్యాటింగ్ లో మరో 20 పరుగులు చేసి ఉంటే మా పరిస్థితి మరో విధంగా ఉండేది. అంతేగాక బౌలింగ్ లో కూడా రెండు, మూడు ఓవర్లలో భారీగా పరుగులిచ్చాం. అదే మా ఓటమికి కారణమైంది’ అని చెప్పుకొచ్చాడు.