మీకు పుణ్యముంటది.. మనం తర్వాత చూసుకుందాం.. ఈ మ్యాచ్ గెలవండ్రా.. ముంబై-ఢిల్లీ పోరులో ఆర్సీబీ అభిమానులకు టెన్షన్
IPL 2022 MI vs DC: ఐపీఎల్ లో నేడు రాత్రి అత్యంత కీలకమైన పోరుకు రంగం సిద్ధమవుతున్నది. రెండు జట్ల ప్లేఆఫ్స్ తలరాతలు మార్చే ఈ మ్యాచ్ కోసం దేశంలోని క్రికెట్ అభిమానులు.. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్ వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు..
‘రోహిత్ భాయ్.. మనం మనం ఒకటి. ఏదైనా ఉంటే మనం తర్వాత చూసుకుందాం.. ముందైతే మీరు ఢిల్లీని ఓడించండి..’ ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అభ్యర్థన ఇది. నేడు రాత్రి ప్రఖ్యాత వాంఖెడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికరపోరు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా ముంబైకి ప్రత్యేకంగా పోయేదేమీ లేదు. కానీ ముంబై గెలవాలనే బెంగళూరు అభిమానులు ముప్పై కోట్ల దేవతలను వేడుకుంటున్నారు. కర్మ కాలి ఢిల్లీ గనక ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఇక బెంగళూరు బ్యాగులు సర్దుకోవడమే..
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు మీమ్స్ తో ఫన్ ను పంచుతున్నారు. సాధారణ క్రికెట్ అభిమానులతో పాటు టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్, ప్రస్తుతం ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా ఓ ఫన్నీ ట్వీట్ ను షేర్ చేశారు. ఈ ట్వీట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
నెట్టింట బాగా వైరలవుతున్న ట్వీట్లలో పైన కనిపిస్తున్న ట్వీట్ ఒకటి. ఆర్సీబీ కీ ప్లేయర్లు గా ఉన్న విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ లకు ముంబై ఇండియన్స్ జెర్సీ వేసి ఆ జట్టుకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మీమ్ క్రియేట్ చేశారు. దీంతో పాటు దినేశ్ కార్తీక్ కూడా తన ట్విట్టర్ ఖాతా వేదికగా.. ముంబై ఇండియన్స్ తరఫున తాను ఆడినప్పుడు వేసుకున్న జెర్సీని ధరించి.. ‘ఇది నా పాత జ్ఞాపకాలలో దొరికింది..’ అని ఫన్నీగా రాసుకొచ్చాడు.
ఇక భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ట్విటర్ లో స్పందిస్తూ.. ఆర్సీబీకి కొత్త అర్థం చెప్పాడు. ‘ఈ ఒక్క రోజు రాత్రికి ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బొంబాయి..’ అని ట్వీట్ చేశాడు.
పలు తెలుగు మీమ్స్ పేజీలలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేయకుండా ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలలో ఫోటోలు పంచుకోవడంపై పలువురు అభిమానులు స్పందిస్తూ.. ‘అన్నా మీరు ప్రాక్టీస్ చేయండన్న.. మీరు ఢిల్లీ పై గెలిస్తేనే కదన్నా మేము ప్లేఆఫ్స్ కు వెళ్లేది..’ అని రాసుకొస్తున్నారు.
మరికొందరు ఆర్సీబీ ఫ్యాన్స్.. ‘రోహిత్ భాయ్.. బెంగళూరు మిమ్మల్ని భాగా ప్రేమిస్తున్నది. మాకోసం ఢిల్లీని ఓడించడన్న.. మీకు ముందుగా కృతజ్ఞతలు..’ అని ట్వీట్లు పెడుతున్నారు.
ఏదేమైనా ఈ మ్యాచ్ లో ఢిల్లీ భారీ తేడాతో నెగ్గకపోయినా.. మాములుగా గెలిచినా ఆర్సీబీ కథ అంతే. ఒకవేళ నేటి పోరులో ముంబై గెలిస్తే అప్పుడు ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ లో లక్నో తో తలపడుతుంది.