బర్త్ డే సెలబ్రేషన్స్లో కనిపించిన రవీంద్ర జడేజా... మొదటి రెండు టెస్టులకు జడ్డూ అనుమానమే!
మొదటి టీ20లో గాయపడిన రవీంద్ర జడేజా... ఫిజియో పర్యవేక్షణలో ఉంటూ వైద్యం తీసుకుంటున్న ఆల్రౌండర్...
రెండో టీ20 విజయానంతరం బర్త్ డే సెలబ్రేషన్స్లో కనిపించిన రవీంద్ర జడేజా..
మొదటి టెస్టుకి దూరం... రెండో టెస్టు మ్యాచ్కి అనుమానమే...
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టుకి షాక్ల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. పితృత్వ సెలవుల మీద విరాట్ కోహ్లీ మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి వెళుతుండడంతో కెప్టెన్ కోహ్లీ లేకుండానే మిగిలిన మూడు టెస్టులు ఆడనుంది టీమిండియా. గాయం నుంచి కోలుకోని కారణంగా రోహిత్ శర్మ మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు.
మరోవైపు ఇషాంత్ శర్మ గాయం నుంచి కోలుకున్నా, అతనికి టెస్టు సిరీస్ నుంచి రెస్టు ఇచ్చింది బీసీసీఐ. ఇప్పుడు తాజాగా రవీంద్ర జడేజా కూడా రెండు టెస్టులకు దూరం కానున్నట్టు సమాచారం. మొదటి టీ20లో గాయపడిన రవీంద్ర జడేజా, ఫిజియో పర్యవేక్షణలో వైద్యం తీసుకుంటున్నాడు.
అతని గాయానికి స్కానింగ్ చేసిన వైద్యులు, రెండు వారాల విశ్రాంతి అవసరమని సూచించారట. దాంతో డిసెంబర్ 17 నుంచి మొదలయ్యే మొదటి టెస్టుకి రవీంద్ర జడేజా దూరం కావడం ఖాయం. రెండు టెస్టు సమయానికి కల్లా జడేజా కోలుకుంటాడా? లేదా? అనేది ఇంకా అనుమానంగా మారింది.
ఒకవేళ రెండో టెస్టు సమయానికి జడ్డూ పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే విరాట్, రోహిత్, ఇషాంత్, జడేజా లేకుండానే సెకండ్ టెస్టు ఆడాల్సి ఉంటుంది టీమిండియా.నిన్న రవీంద్ర జడేజా పుట్టినరోజు అయినా టీమ్ బర్త్ డే సెలబ్రేషన్స్లో అతను పాల్గొనలేదు.
మొన్న పుట్టినరోజు జరుపుకున్న శిఖర్ ధావన్, నిన్న పుట్టినరోజు జరుపుకున్న శ్రేయాస్ అయ్యర్, జస్ప్రిత్ బుమ్రాలు మాత్రమే కేక్ కట్ చేశారు. జడ్డూ ఫిజియో పర్యవేక్షణలో జట్టుకి దూరంగా ఉన్నాడు.