INDvsAUS: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కంగారూలకు అశ్విన్ ఒకే ఓవర్లో డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కంగారూలకు ఒకే ఓవర్లోనే డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. అతడు వేసిన 23వ ఓవర్లో ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్ లు అవుటయ్యారు. ఓపెనర్ ఖవాజా రాణిస్తున్న ఈ టెస్టులో లబూషేన్ గానీ స్టీవ్ స్మిత్ గానీ నిలబడితే ఆసీస్ భారీ స్కోరుకు బాటలుపడేవే.
అప్పటికీ ఆస్ట్రేలియా 22 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 88 పరుగులు చేసింది. మార్నస్ లబూషేన్ (22 బంతుల్లో 16), ఖవాజా (47) పరుగులతో ఉన్నారు. 23వ ఓవర్ ను అశ్విన్ వేశాడు. ఈ ఓవర్లో ఖవాజా తొలి బంతికి సింగిల్ తీసి లబూషేన్ కు స్ట్రైకింగ్ ఇచ్చాడు.
లబూషేన్.. తర్వాతి రెండు బంతులను డిఫెన్స్ ఆడాడు. కానీ నాలుగో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని లబూషేన్ డిఫెన్స్ ఆడబోయాడు. కానీ అది ప్యాడ్స్ కు తాకి స్లిప్స్ దిశగా వెళ్లగా కోహ్లీ క్యాచ్ అందుకున్నాడు. టీమిండియా ప్లేయర్లు అవుట్ కోసం అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. రోహిత్ రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి నేరుగా వికెట్లకు తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. దీంతో లబూషేన్ పెవిలియన్ బాట పట్టాడు.
అదే ఓవర్లో స్మిత్ (0)ను కూడా అశ్విన్ పెవిలియన్ కు పంపించాడు. 23వ ఓవర్ చివరి బంతికి స్మిత్.. డిఫెన్స్ ఆడబోగా బంతికాస్తా బ్యాట్ ఎడ్జ్ కు తాకి వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ చేతుల్లో పడింది. ఆటగాళ్లు అప్పీల్ చేసినా అంపైర్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఉన్నాడు. కానీ స్మిత్ అప్పటికే క్రీజు విడిచి వెళ్లిపోయాడు. ఫలితంగా ఆసీస్ మూడో వికెట్ కూడా కోల్పోయింది. ఆసీస్ అగ్ర బ్యాటర్లిద్దరినీ మూడు బంతుల వ్యవధిలోనే అవుట్ చేసిన అశ్విన్.. ఆ జట్టును కట్టడి చేశాడు.
కుదురుకున్న ఆసీస్ కు జడ్డూ షాక్..
లంచ్ తర్వాత ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయిన ఆసీస్ తర్వాత నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (81) సెంచరీ దిశగా సాగాడు.. అతడికి మిడిలార్డర్ బ్యాటర్ పీటర్ హ్యాండ్స్కాంబ్ (50 బంతుల్లో 27 నాటౌట్, 4 ఫోర్లు) అండగా నిలిచాడు. ఈ ఇద్దరూ కలిసి అర్థ సెంచరీ (57) భాగస్వామ్యం పూర్తి చేసి భారత బౌలర్లను విసిగించారు. కానీ రవీంద్ర జడేజా ఈ జోడీని విడదీశాడు. జడ్డూ వేసిన 46వ ఓవర్ ఐదో బంతికి షాట్ ఆడబోయిన ఖవాజా.. కెఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. టెస్టులలో జడేజాకు ఇది 250వ వికెట్. ఇక తర్వాతి ఓవర్లో ఆసీస్ కు అశ్విన్ మరో షాక్ ఇచ్చాడు. అతడు వేసిన 47వ ఓవర్లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (0) ఫస్ట్ స్లిప్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 47 ఓవర్లు ముగిసేటప్పటికీ ఆసీస్.. 6వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
