కెప్టెన్సీపై కోహ్లీకి రవిశాస్త్రి ఆరు నెలల క్రితమే ఆ సలహా ఇచ్చాడు..!
టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి, ఐపీఎల్లోనూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ చేసిన ప్రకటన సంచలనం రేపింది. అయితే, ఈ నిర్ణయానికి సంబంధించి రవి శాస్త్రి ఆరు నెలల క్రితమే ఆయనకు ఓ సలహా ఇచ్చాడని తెలిసింది. విరాట్ కోహ్లీ ఆ సూచనను పాక్షికంగా అమలు చేశాడు.
విరాట్ కోహ్లీ(Virat Kohli) కెప్టెన్సీ(Captaincy)పై చేసిన ప్రకటన క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్ అయింది. ఆయన వార్త అభిమానులను కుదిపేసింది. ఇప్పటికీ దీనిపై చర్చ జరుగుతూనే ఉన్నది. త్వరలో జరగనున్న టీ 20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీని, ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన భారత్ సహా ఇతర దేశాల్లోనూ క్రికెట్ అభిమానుల మధ్య చర్చ జరిగింది. అయితే, విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం ప్రకటించడానికి ఆరు నెలల ముందే టీమిండియా క్రికెట్ కోచ్ రవిశాస్త్రి(Ravi shastri) దీనిపై ఆయనకు ఓ సూచన చేసినట్టు తెలిసింది. రవిశాస్త్రి చేసిన సూచనలో విరాట్ కోహ్లీ పాక్షికంగానే అమలు చేశాడు.
ఈ ఏడాది ప్రారంభంలో భారత్ ఆసిస్ను అదే దేశంలో టెస్టు సిరీస్లో మట్టికరిపించిన సంగతి తెలిసిందే. ఆ టెస్టు సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీకి రవిశాస్త్రి ఓ సూచన చేశాడు. బ్యాటింగ్పై పూర్తి దృష్టి పెట్టడానికి వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సూచించాడు. టెస్టులో కొనసాగాలని చెప్పాడు. అప్పుడు ఫామ్లేక కొట్టుమిట్టాడుతున్న విరాట్ కోహ్లీకి రవిశాస్త్రి ఈ సూచన చేశాడట.
ఈ సూచనలు ఆలకించినప్పటికీ కేవలం పొట్టి ఫార్మాట్లోనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ భావించాడు. అందుకే టీ20, ఐపీఎల్ ఆర్సీబీ టీమ్కు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. అయితే, ఈ సలహా సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. రవి శాస్త్రి చెప్పినట్టు ఆరు నెలల క్రితమే విరాట్ కోహ్లీ ఈ ప్రకటన చేసి ఉంటే ఆయన ఆట తీరు మెరుగ్గా ఉండేదని కొందరు అభిప్రాయపడ్డారు.