రంజీ ట్రోఫీలో వరుసగా రెండో సెంచరీ బాదిన బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారం... మధ్యప్రదేశ్తో సెమీ ఫైనల్ మ్యాచ్లో సెంచరీ తర్వాత భార్యకు లవ్లీ మెసేజ్...
రంజీ ట్రోఫీ 2022లో బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారి శతకాల మోత మోగిస్తున్నాడు. జార్ఖండ్తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 173 బంతుల్లో 73 పరుగులు చేసిన మనోజ్ తివారి, రెండో ఇన్నింగ్స్లో 185 బంతుల్లో 136 పరుగులు చేసి... బెంగాల్ సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు...
మధ్యప్రదేశ్తో జరుగుతున్న సెమీ ఫైనల్లో సెంచరీతో చెలరేగిన బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్, తన జట్టుకి మంచి స్కోరు అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్... 105.3 ఓవర్లలో 341 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హిమాన్షు మంత్రి 165 పరుగులు చేయగా అక్షత్ రఘువంశీ 81 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు...
తొలి ఇన్నింగ్స్లో సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది బెంగాల్. అభిషేక్ రమన్, సుదీప్ గరామీ డకౌట్ కాగా మజుంబర్ 4, అభిమన్యు ఈశ్వరన్ 22, అభిషేక్ పోరెల్ 9 పరుగులకే అవుట్ కావడంతో 54 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది బెంగాల్. ఈ దశలో మనోజ్ తివారి, షాబాజ్ అహ్మద్ కలిసి ఆరో వికెట్కి 186 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...
211 బంతుల్లో 12 ఫోర్లతో 102 పరుగులు చేసిన మనోజ్ తివారి, ఫస్ట్ క్లాస్ కెరీర్లో 28వ సెంచరీ అందుకున్నాడు. సెంచరీ పూర్తయిన తర్వాత జేబులో నుంచి ఓ చిటీని తీసి, చూపించాడు తివారి... ‘ఐ లవ్ యూ సుస్మిత... (మై స్వీటీ పై) మ్యాక్సిమస్, యువా...’ అంటూ లవ్ సిబల్తో భార్యకు స్వీట్ మెసేజ్తో సెంచరీని అంకితమిచ్చాడు మనోజ్ తివారి...
రంజీ ట్రోఫీలో 7868 పరుగులు పూర్తి చేసుకున్న మనోజ్ తివారి, రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో 9వ స్థానానికి చేరుకున్నాడు. భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్, రంజీల్లో 12038 పరుగులు చేసి ఎవ్వరికీ అందనంత ఎత్తులో టాప్లో నిలిస్తే అమోల్ ముజుదర్ 9205 పరుగులతో టాప్ 2లో ఉన్నాడు.
షాబజ్ అహ్మద్ 209 బంతుల్లో 12 ఫోర్లతో 116 పరుగులు చేసి అవుట్ కాగా బెంగాల్ జట్టు 89.2 ఓవర్లలో 273 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మధ్యప్రదేశ్కి 68 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించకముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, బెంగాల్లో మంత్రిగా పదవీ బాధ్యతలు కూడా స్వీకరించాడు క్రికెటర్ మనోజ్ తివారి. పశ్చిమ బెంగాల్లోని షిబ్పూర్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన మనోజ్ తివారి, ఐపీఎల్ 2022 మెగా వేలంలో పేరు రిజిస్టర్ చేయించుకున్నా... ఏ జట్టూ అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు...
టీమిండియా తరుపున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచులు ఆడిన మనోజ్ తివారి, వన్డేల్లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ బాదాడు. బౌలింగ్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 119 మ్యాచులు ఆడిన మనోజ్ తివారి, 51.78 సగటుతో 8752 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్, కోల్కత్తా నైట్రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడిన మనోజ్ తివారి, చివరిసారిగా 2018 సీజన్లో బరిలో దిగాడు.
