ఇన్‌స్టా ఇన్‌ఫ్ల్యూఎన్సర్ స్వప్నా గిల్‌తో నడిరోడ్డుపై గొడవ పడిన పృథ్వీ షా... సోషల్ మీడియాలో వీడియో వైరల్! స్నేహితుడి కారుపై దాడి జరిగినట్టు, 8 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 

ముంబైలో క్రికెటర్ పృథ్వీ షా కారుపై కొందరు దుండగులు దాడి చేసిన కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. క్రికెటర్ పృథ్వీ షాని సెల్ఫీ ఇవ్వాల్సిందిగా కోరింది మరెవ్వరో కాదు సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూఎన్సర్ స్వప్నా గిల్. స్వప్నా గిల్, పృథ్వీ షా ఓ కర్ర కోసం తగులులాడుకోవడం దగ్గర్నుంచి జరిగిన రచ్చ అంతా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

స్వప్నా గిల్, క్రికెటర్‌తో సెల్ఫీ దిగేందుకు వచ్చిన తర్వాత గొడవ జరిగిందా? లేక పాత పరిచయాలతో ఉద్దేశపూర్వకంగానే పృథ్వీ షా కారుపై దాడి చేసేందుకు ఆమె కర్రలు, మనుషులతో అక్కడికి వచ్చిందా? అనేది తెలియాల్సి ఉంది. 

అయితే పోలీసులు చెప్పిన కథనం మాత్రం వేరేలా ఉంది. పోలీసుల కథనం ప్రకారం ముంబైలోని విలే పార్లే ఈస్ట్‌లో ఉన్న ఓ లగ్జరీ హోటల్‌లో పృథ్వీ షాని కొందరు క్రికెట్ ఫ్యాన్స్, సెల్ఫీ ఇవ్వాల్సిందిగా కోరుతూ మీదకి వచ్చారు. అయితే పృథ్వీ షా వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు. దీంతో అతన్ని వెంబడించిన 8 మంది దుండగులు, పృథ్వీ షా స్నేహితుడు ప్రయాణిస్తున్న కారుపై దాడికి పాల్పడ్డారు...

నిజానికి పృథ్వీ షా ఆ హోటల్‌లోనే ఉండిపోగా, అతన్ని కలవడానికి వచ్చిన స్నేహితుడు మాత్రమే కారులో ఇంటికి పయనమయ్యాడు. ఈ విషయం తెలియని దుండగులు, జోగేశ్వరి లింక్ రోడ్డు సమీపంలో కారుని ఆపి, బాధితుడి నుంచి రూ.50 వేలు కూడా డిమాండ్ చేసినట్టు తెలిపారు..

అయితే వీడియోలో మాత్రం ఈ సంఘటనలో పృథ్వీ షా స్నేహితుడు కాకుండా స్వయంగా అతనే ఉన్నట్టు క్లియర్‌గా తెలుస్తోంది. ఈ సంఘటనలో క్రికెటర్ పృథ్వీ షానే తన మనుషులతో సెల్ఫీ అడిగేందుకు వచ్చిన స్వప్నా గిల్‌పై దాడికి పాల్పడినట్టు సోషల్ మీడియాలో ఓ కథనం ప్రచారంలో ఉంది. ఈ దాడిలో పృథ్వీ షా బాడీ గార్డులు, స్వప్నా గిల్‌ని గాయపరిచినట్టు కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు చేసింది.. ఈ వివాదం ఎంత వరకూ వెళ్తుంది, పృథ్వీ షా కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చూడాలి..

ఆస్ట్రేలియా టూర్‌లో పృథ్వీ షాని ప్రధాన ఓపెనర్‌గా ఎంపిక చేసింది టీమిండియా. అయితే ఆడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు పృథ్వీ షా. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ దెబ్బకు పృథ్వీ షాని పక్కనబెట్టేసింది టీమిండియా...

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపికైన పృథ్వీ షా, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరి రెండు టెస్టులకు ప్రకటించే జట్టులో తన పేరు ఉంటుందని ఆశపడుతున్నాడు పృథ్వీ షా. అయితే ఇప్పటికే టీమ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, సూపర్ ఫామ్‌లో ఉన్నా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు..

మరోవైపు రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో అదరగొడుతున్న మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్ కూడా టెస్టు టీమ్‌లో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో పృథ్వీ షాకి టెస్టు టీమ్‌కి పిలుపు రావడం దాదాపు అసాధ్యమే..