Asia Cup 2023: ఏడాదికాలంగా సా...గుతున్న ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం సద్దుమణిగిందా..? ఈ టోర్నీ నిర్వహణకు లైన్ క్లీయర్ అయింది.
సుమారు ఏడాదికాలంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య సా...గుతున్న వివాదానికి తెరపడ్డట్టే కనిపిస్తోంది. ఆసియా కప్ - 2023 నిర్వహణ విషయంలో ఇరు బోర్డులు ‘ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు’ అన్న సూత్రాన్ని పాటిస్తున్నట్టున్నాయి. పాకిస్తాన్కు వెళ్లేది లేదని భీష్మించుకున్న టీమిండియా.. పీసీబీ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ కు కూడా అంగీకారం తెలపలేదు. కానీ తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ టోర్నీని పాకిస్తాన్ తో పాటు శ్రీలంకలో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) లోని అన్ని దేశాలు అంగీకారం తెలిపినట్టు తెలుస్తున్నది.
పీటీఐ సమాచారం మేరకు.. ఆసియా కప్ - 2023 ను పాకిస్తాన్ తో పాటు శ్రీలంక లో నిర్వహించేందుకు ఏసీసీ సభ్య దేశాలు అంగీకరించాయి. పీసీబీ గతంలో సూచించిన హైబ్రిడ్ మోడల్ లోనే ఆసియా కప్ జరుగనుంది. అయితే పాకిస్తాన్ తో పాటు దుబాయ్ లో కాకుండా శ్రీలంకలో మిగిలిన మ్యాచ్ లు జరుగుతాయి. పాక్ లో నాలుగు, శ్రీలంకలో 9 మ్యాచ్ లు ఆడించేందుకు పీసీబీ కూడా అంగీకారం తెలిపింది.
అంటే పాకిస్తాన్ ఆడే మ్యాచ్ (నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకతో) లు లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరుగుతాయి. భారత్ తో పాటు ఇతర దేశాలు ఆడే మ్యాచ్ లు లంక (ఇంకా వేదికలు ఖరారు చేయలేదు) లో జరుగనున్నాయి. ఈ ప్రతిపాదనపై బీసీసీఐ కూడా అభ్యంతరమేమీ చెప్పలేదని తెలుస్తున్నది.
వరల్డ్ కప్కు కూడా వస్తాం..
ఆసియా కప్ ను తమ దేశంలో నిర్వహించకున్నా.. మొత్తానికి మొత్తంగా ఈ టోర్నీని మరో దేశానికి తరలించినా తాము దీనిని బహిష్కరిస్తామని, ఈ ఏడాది భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో కూడా ఆడబోమని పీసీబీ గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆసియా కప్ పంచాయితీ ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ కు కూడా వస్తామని పాకిస్తాన్ ఐసీసీకి హామీ ఇచ్చిందని తెలుస్తున్నది. అయితే దీనిపై ఇరు బోర్డులతో పాటు ఐసీసీ కూడా ఇంకా అధికారిక ప్రకటన వెలువరించలేదు. మరో రెండు రోజుల్లో బీసీసీఐ.. వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఈ సందర్భంగా దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
అన్నీ కుదిరితే నరేంద్ర మోడీ స్టేడియం (అహ్మదాబాద్) లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి.
