టీ20 వరల్డ్కప్ జట్టులో మార్పులు చేయండి... పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజాకి పాక్ ప్రధాని ఆదేశం...
పాక్ జట్టులో ప్రకంపనలు సృష్టించిన టీ20 వరల్డ్కప్ జట్టు... పాక్ జట్టులో షోయబ్ మాలిక్, ఫకార్ జమాన్లకు దక్కని చోటు... మార్పులు చేయాలని సూచించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీకి 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే పీసీబీ జట్టును ప్రకటించిన గంటన్నరకే హెడ్కోచ్ పదవికి మిస్బావుల్ హక్, బౌలింగ్ కోచ్ పదవికి వకార్ యూనిస్ రాజీనామాలు ఇచ్చారు. టీ20 వరల్డ్కప్ టోర్నీకి ప్రకటించిన జట్టుపై అసంతృప్తితోనే ఇలా అర్ధాంతరంగా తమ పదవుల నుంచి తప్పుకుంటున్నట్టు కామెంట్ చేశారు...
క్రికెట్ విశ్లేషకులు కూడా పాక్ బోర్డు సెలక్టర్లు ప్రకటించిన జట్టుపై విమర్శలు చేశారు. ఫకార్ జమాన్, షోయబ్ మాలిక్ వంటి ప్లేయర్లకు టీ20 వరల్డ్కప్ టోర్నీకి ప్రకటించిన జట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి, జట్టులో మార్పులు చేయాలని పీసీబీ కొత్త ఛైర్మన్ రమీజ్ రాజాకి ఆదేశాలు జారీ చేశారట...
పాక్ మాజీ కెప్టెన్ అయిన ఇమ్రాన్ ఖాన్... టీ20 వరల్డ్కప్ టోర్నీకి ఎంపికైన ఆజమ్ ఖాన్, మహ్మద్ హుస్సెన్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్లను తొలగించి... వారి స్థానంలో ఫకార్ జమాన్, షార్జిల్ ఖాన్, షోయబ్ మాలిక్, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని సూచించినట్టు సమాచారం...
వన్డే సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్ జట్టు, పాక్ టూర్ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించడం, ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు కూడా పాకిస్తాన్కి రావడం లేదని చెప్పడంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకి కావాల్సినంత బ్రేక్ దొరికింది.
ఈ సమయంలో బంగ్లాదేశ్, శ్రీలంక వంటి జట్లతో టీ20 సిరీస్లు నిర్వహించాలని పాక్ బోర్డు ప్రయత్నించినా... ఐపీఎల్ కారణంగా కీ ప్లేయర్లు దూరం కావడంతో పాక్తో సిరీస్లు ఆడేందుకు ఈ జట్లు అంగీకరించలేదని సమాచారం..