ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి శ్రీలంకపై విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్... కేన్ విలియంసన్ అజేయ సెంచరీ! ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి టీమిండియా..
అహ్మదాబాద్లో జరుగుతున్న నాలుగో టెస్టు రిజల్ట్తో సంబంధం లేకుండా టీమిండియా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి అర్హత సాధించింది. దీనికి కారణం న్యూజిలాండ్. శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో శ్రీలంక 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో శ్రీలంక, డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకోగా... టీమిండియా, ఆస్ట్రేలియాతో కలిసి వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడనుంది..
285 పరుగుల విజయ లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ మొదలెట్టిన న్యూజిలాండ్, ఆఖరి సెషన్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా పోరాడింది. ఆఖరి ఓవర్లో న్యూజిలాండ్ విజయానికి 8 పరుగులు కావాల్సి రావడంతో తీవ్ర ఉత్కంఠ రేగింది. మొదటి రెండు బంతుల్లో 2 పరుగులు రాగా, మూడో బంతికి మ్యాట్ హెన్రీ రనౌట్ అయ్యాడు. అయితే మూడో బంతికి ఫోర్ బాదిన కేన్ విలియంసన్, టీమిండియాకి ఫైనల్ గేట్లు తెరిచేశాడు...
జూన్ 7 నుంచి 12 మధ్య లండన్లోని ఓవల్, కెన్నింగ్టన్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు సార్లు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా టీమిండియా రికార్డు క్రియేట్ చేసింది. డబ్ల్యూటీసీ 2021 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా, న్యూజిలాండ్ చేతుల్లోనే ఓడడం విశేషం.
ఆఖరి బంతికి సింగిల్ తీసిన కేన్ విలియంసన్, ఒంటిచేత్తో న్యూజిలాండ్కి విజయాన్ని అందించాడు. 194 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్తో 121 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన కేన్ విలియంసన్, కెరీర్లో 27వ టెస్టు సెంచరీని అందుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 355 పరుగులకి ఆలౌట్ కాగా డార్ల్ మిచెల్ సెంచరీతో ఆదుకోవడంతో న్యూజిలాండ్ 373 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ఏంజెలో మాథ్యూస్, శ్రీలంకకి 302 పరుగుల భారీ స్కోరు అందించాడు...
285 పరుగుల టార్గెట్తో ఆఖరి ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిన న్యూజిలాండ్, డివాన్ కాన్వే వికెట్ త్వరగా కోల్పోయింది. డివాన్ కాన్వే 5 పరుగులు చేసి అవుట్ కాగా టామ్ లాథమ్ 24, హెన్రీ నికోలస్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు. డార్ల్ మిచెల్ 86 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేయగా టామ్ బ్లండెల్ 3, మిచెల్ బ్రాస్వెల్ 10, టిమ్ సౌథీ 1, హెన్రీ 4 పరుగులు చేసి వెంటవెంటనే అవుట్ కావడంతో ఉత్కంఠ రేగింది.
అయితే ఓవర్లు ముగిసే కొద్దీ, చేయాల్సిన పరుగులు పెరుగుతుండడంతో టీ20 మ్యాచ్ని మించి ఉత్కంఠ రేగింది. అయితే ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో కుదురుకుపోయిన కేన్ విలియంసన్ 121 పరుగులతో అజేయంగా నిలిచి, న్యూజిలాండ్కి విజయాన్ని, టీమిండియాకి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ని అందించాడు.. సరిగ్గా నిర్ణీత ఓవర్లలో ఆఖరి బంతికి సింగిల్ తీసి కివీస్ విజయాన్ని అందుకుంది.
