IPL 2022: పది రోజుల్లో ఆ ప్రక్రియ ముగించండి.. కొత్త ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్ లైన్..
Deadline For New IPL Franchises: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫిబ్రవరిలో నిర్వహించతలపెట్టిన మెగా వేలంలో మార్పులేమీ లేదన్న బీసీసీఐ.. రెండు కొత్త ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఐపీఎల్ లో వచ్చే సీజన్ నుంచి కొత్తగా ప్రవేశించబోతున్న రెండు కొత్త ఫ్రాంచైజీలు లక్నో, అహ్మదాబాద్ లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. మెగా వేలం ముందున్న తరుణంలో ఆ జట్లు.. ఆటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియను వీలున్నంత త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 22 ను తుది తేదిగా నిర్ణయించినట్టు సమాచారం. లక్నో, అహ్మదాబాద్ లు ఇప్పటికే కోచ్ తో పాటు సహాయక సిబ్బందిని నియమించుకున్నాయి.
ఐపీఎల్ లోని రెండు కొత్త ఫ్రాంచైజీలకు బీసీసీఐ పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. బెట్టింగ్ సంస్థలతో కాంట్రాక్టులు కుదుర్చుకుందన్న ఆరోపణలతో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ (సీవీసీ క్యాపిటల్స్) భవితవ్యంపై ఇన్నాళ్లు అనుమానాలు ఉన్నా బీసీసీఐ దానికి క్లీయరెన్స్ ఇచ్చింది. దీంతో ఇరు జట్లు.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలో లేని ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టైంది. గతంలో డిసెంబర్ 25నే ఈ డెడ్ లైన్ నిర్ణయించగా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ బెట్టింగ్ ఆరోపణలతో వాయిదా పడిన విషయం తెలసిందే.
నిబంధనలు ఇవి :
- రెండు జట్లు.. ఇప్పటికే అందుబాటులో ఉన్న ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు. వీరిలో ఇద్దరు భారతీయ ఆటగాళ్లు, ఒకరు విదేశీ ఆటగాడు అయి ఉండాలి.
- ముగ్గురు ప్లేయర్లను ఎంపిక చేసుకోవడానికి గాను ఆటగాళ్లకు చెల్లించే వేతనం రూ. 33 కోట్లకు మించరాదు.
- ఉదాహరణకు.. నెంబర్ 1 ప్లేయర్ కు రూ. 15 కోట్లు, రెండో ఆటగాడికి రూ. 11 కోట్లు, మూడో ఆటగాడికి రూ. 7 కోట్లు
- అన్ క్యాప్డ్ (ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని ఆటగాడు) ప్లేయర్ ను ఎంపిక చేసుకుంటే అతడికి కనీసం రూ. 4 కోట్ల వరకు ఖర్చు పెట్టవచ్చు.
ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈ రెండు జట్లకు ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడానికి రెండు వారాల టైమ్ ఇవ్వాలని భావించినా ఇప్పుడు పది రోజులతోనే సరిపెట్టింది బీసీసీఐ. ఇక లక్నోకు కెప్టెన్ గా కెఎల్ రాహుల్ బాధ్యతలు తీసుకోనున్నాడని వార్తలు వినిపిస్తుండగా.. అహ్మదాబాద్ కు హార్థిక్ పాండ్యా పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే లక్నో ఆండీ ఫ్లవర్ ను హెడ్ కోచ్ గా నియమించగా.. ఆశిష్ నెహ్రా అహ్మదాబాద్ ప్రధాన శిక్షకుడిగా నియమితుడైన విషయం తెలిసిందే.
ఇక నిన్న జరిగిన పాలకవర్గ సమావేశంలో ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ.. ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించి ఏ మార్పులూ లేవని వెల్లడించాడు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగానే దీనిని నిర్వహిస్తామని తెలిపాడు.